అధికారం పోయాకే దళితులు గుర్తొస్తారా ? చంద్రబాబుపై అంబటి ఫైర్-మిగిలింది రిటైర్మెంటే..
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. ఇప్పటికే జగన్ సర్కార్ లోని మంత్రుల్ని టార్గెట్ చేస్తూ విపక్ష నేత చంద్రబాబు చేస్తున్న విమర్శలు పదునెక్కుతుండగా.. వాటికి మంత్రులు కూడా అదే స్ధాయిలో కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లాల్లో దళితుడి మరణంపై చంద్రబాబు చేసిన విమర్శలకు మంత్రి అంబటి రాంబాబు ఘాటు కౌంటర్ ఇచ్చారు.
చంద్రబాబుకు మిగిలింది ఇక రిటైర్మెంట్ ఒక్కటేనని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ప్రజలు చెప్పులతో కొట్టారు కాబట్టే.. బాబు ప్రతిపక్షంలో ఉన్నాడన్నారు. బాబు పుత్రుడిని ఒక చోట.. దత్తపుత్రుడుని రెండు చోట్ల ప్రజలు ఓడించారన్నారు. అధికారం పోయేటప్పటికి బాబుకు అంబేడ్కర్, సమ సమాజం గుర్తొస్తున్నాయ్ అంటూ దళితుడి మృతిపై చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. అధికారం పోతే అంబేడ్కర్.. అధికారంలో ఉంటే సుజనా, రాయపాటి, రామోజీ, రాధాకృష్ణ, బీఆర్ నాయుడులు గుర్తొస్తారంటూ చురకలు అంటించారు.
ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నప్పుడే కులాలపై బాబు మనస్తత్వమేమిటో అర్థమైందంటూ బాబు పాత వ్యాఖ్యల్ని అంబటి గుర్తుచేశారు. 25కు 25 ఎంపీ స్థానాలు తామే గెలుస్తామని, అందుకే బాబుకు ఫ్రస్ట్రేషన్ వస్తోందన్నారు. బాబు హయాంలో చేసిన అప్పులు తనచుట్టూ ఉండే అవినీతి మనుషులే తిన్నారన్నారు. జగన్ చేసిన అప్పుల వల్ల కోటిన్నర మందికి డీబీటీ ద్వారా లబ్ధి చేకూరిందని అంబటి గుర్తుచేశారు. పోలవరంపై తన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా పారిపోయే పిరికిపంద బాబు అన్నారు. కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టు మాధవ్ ఫేక్ వీడియో చుట్టే బాబు నీచ రాజకీయం సాగుతోందన్నారు.
ఈ మధ్య జాతీయ స్ధాయిలో వెలువడిన సర్వేల్లో వైసీపీకి వచ్చే ఎన్నికల్లో 23 ఎంపీ సీట్లు వస్తాయని తేలిందని, కానీ అది నిజం కాదన్నారు. గడప గడపలో తాను చూసిన దాన్ని బట్టి 25కి 25 ఎంపీ సీట్లు గెలవబోతున్నామని అంబటి తెలిపారు. చంద్రబాబు కూడా తెలివి తక్కువవాడు కాదని, ఆయనకు సర్వేలు చేయించుకునే అలవాటు ఉందని అంబటి గుర్తుచేశారు. ప్రజల నాడి కాస్తోకూస్తో పట్టుకోగలడు కానీ ప్రజలకు చెప్పడన్నారు. గత ఎన్నికల్లో... మేము అధికారంలోకి వచ్చేముందు చంద్రబాబు నూటికి 150 పాళ్లు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని గప్పాలు పలికారని, ఓడిపోతారని తెలిసి కూడా చంద్రబాబు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారని, ఇవాళ కూడా జరగబోయే 2024 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని, చంద్రబాబు నాయుడు, తన పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోతుందని తెలిసి ఫ్రస్టేషన్లో తీవ్రమైన పదజాలంతో ఏదేదో మాట్లాడేస్తున్నారని అంబటి ఆక్షేపించారు.