బాధేసింది, అందుకే చిరంజీవి, దాసరిలను కలిశా: అంబటి వ్యాఖ్య
విజయవాడ: కులతత్వం కోసమే చిరంజీవి, దాసరి నారాయణ రావులను తాము కలిశామనే ఆరోపణలు సరికాదని, మా కులాన్ని అణగదొక్కుతుంటే ప్రతిఘటించేందుకే తాము వారిని కలిశామని వైసిపి నేత అంబటి రాంబాబు సోమవారం నాడు అన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. తాను ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తన శవాన్ని తీసుకెళ్లండని కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యానించడం బాధాకరమన్నారు.
ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో తెలుసుకునేందుకు ముద్రగడ వ్యాఖ్యలే నిదర్శనమని చెప్పారు. ముద్రగడను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి పైన ఉందని చెప్పారు. ఆయనకు ఏమైనా జరిగితే తీ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
హామీలు కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యాయన్నారు. తాము సంయమనం పాటిస్తుంటే, చంద్రబాబు సర్కారు రెచ్చగొడుతుందని విమర్శించారు. కాపులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కావాలనే జాప్యం చేస్తున్నారన్నారు.
తన కులానికి అపాయం కలిగినప్పుడు సహాయం చేయలేని వాడు పక్క కులానికి ఏం చేస్తాడని అంబడి ప్రశ్నించారు. కాపులకు ఇచ్చిన హామీలను వెంటనే చంద్రబాబు ప్రభుత్వం నెరవేర్చి, ముద్రగడ దీక్షను విరమింప చేయాలన్నారు.