'ఆ నిర్ణయం వెనుక బాబు!.. దేశప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందే'
మోడీ-చంద్రబాబుల జోడీ గురించి వెంకయ్య ఘనంగా చెప్పారు గానీ ప్రస్తుతం ఈ జోడీ దేశానికి బోడిగా మారిందని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.
హైదరాబాద్ : కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యలను ఎద్దేవా చేస్తూ.. ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబులపై విమర్శల వర్షం కురిపించారు వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. మోడీ-చంద్రబాబుల జోడీ గురించి వెంకయ్య ఘనంగా చెప్పారు గానీ ప్రస్తుతం ఈ జోడీ దేశానికి బోడిగా మారిందని ఎద్దేవా చేశారు.
పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో సామాన్యులంతా అల్లాడుతున్నారని, సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి తప్పితే తగ్గే పరిస్థితులు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెనుక తన సలహాలున్నాయని చెప్పుకుంటున్న చంద్రబాబు తీరును తప్పుబట్టారు అంబటి. నోట్లను రద్దు చేయాలంటూ ప్రధాని మోడీకి లేఖ రాసింది తానేనని చెప్పుకొచ్చిన చంద్రబాబు.. తీరా ఇప్పుడు మాట మారుస్తున్నారని మండిపడ్డారు.

నోట్ల రద్దు నిర్ణయం వెనుక చంద్రబాబు ప్రమేయం గనుక ఉండుంటే.. తక్షణం దేశ ప్రజలందరికీ ఆయన క్షమాపణలు చెప్పాల్సిందిగా డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో అసలు డబ్బు పంపిణీ జోలికి వెళ్లకుండా ఉండగలమని చంద్రబాబు ప్రకటించగలరా అని నిలదీశారు. నోట్ల రద్దుతో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్న ప్రజలకు సాంత్వన చేకూర్చేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications