నా కొడుకు పవన్ కళ్యాణ్ సమంతాలకు తీసిపోడు..కోడలు మౌనదీక్ష..ప్యాకేజీల చిచ్చు..!
ఈ మధ్యకాలంలో పెళ్లయిన మూనాళ్లకే కాపురాలు కూలుతున్నాయి. ఇందుకు అనేక కారణాలున్నాయి. అత్తింటి వేధింపులకు కొన్ని జంటలు విడిపోతుండగా అదనపు కట్నం కోరుతూ భార్యను భర్త పుట్టింటికి పంపిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ వివాహిత తన అత్తగారింటి ముందు మౌన దీక్ష చేపట్టింది.
మండపేట మండలం ద్వారపూడికి చెందిన లక్ష్మీ శైలజకు నామాల రంగారావు కుమారుడైన మోహన్ శ్యామ్ చరణ్తో 2020 డిసెంబర్లో వివాహమైంది.అయితే పెళ్లి సమయంలో లక్ష్మీ శైలజ తల్లిదండ్రులు ఇస్తామన్న అన్ని కట్న కానుకలు ముందుగానే అందజేశారు. అర ఎకరం పంట భూమి,5 లక్షల నగదు మరో 5 లక్షల రూపాయలు ఆడపడుచు కట్నం 20 తులాల బంగారు ఆభరణాలు పెట్టారు. శ్యామ్ చరణ్ సాఫ్ట్వేర్ ఉద్యోగి.పెళ్లి సమయంలో ఆయన వేతనం రూ.60 వేలుగా ఉన్నింది. అయితే ఆ తర్వాత తన జీతం రెట్టింపు అయ్యి లక్షన్నర రూపాయలైంది. దీంతో అత్తింటి వారు లక్ష్మీ శైలజపై వేధింపులకు దిగారు.
తమ కొడుకు జీతం పెరిగిందని అదనపు కట్నం తీసుకురావాల్సిందిగా లక్ష్మీ శైలజపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. పైగా శైలజను పుట్టింటికి పంపించేశారు. దీంతో శైలజ తన తల్లిదండ్రులతో కలిసి అత్తారింటి ముందు మౌన దీక్షకు దిగింది. తన తన భర్త శ్యామ్ చరణ్ కలిసి కాపురం చేసేందుకు అనుమతించాలంటూ రోధిస్తోంది. ఇష్టపూర్వకంగా పెద్దలు నిశ్చయించిన పెళ్లి చేసుకుని అన్ని కట్నకానుకలు ఇచ్చిన తర్వాత ఇలా మాట్లాడితే ఎలా అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదేంటని అడిగితే తన మానసిక పరిస్థితి సరిగ్గా లేదని అసత్య ప్రచారం చేస్తున్నారని తల్లిదండ్రులు కన్నీరుమునీరవుతున్నారు. ఇది కాకుండా తన అత్తపై లక్ష్మీ శైలజ దాడి చేసిందని తప్పుడు కేసు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్, సమంతా లాంటి పెద్ద స్టార్లే విడాకులు తీసుకుంటుండంగా లేనిది.. నా కొడుకు నీకు విడాకులు ఇస్తే తప్పేంటని చెబుతూ అత్తమామలు మనో వేదనకు గురిచేస్తున్నారని కంటతడి పెట్టింది లక్ష్మీ శైలజ.తన భర్త వచ్చి కాపురం తీసుకెళ్లే వరకు ఇక్కడే మౌన దీక్ష చేస్తానని బాధితురాలు పేర్కొంది.