అవమానం: అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ
విశాఖపట్నం: భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్కు విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో అవమానం జరిగింది. లక్ష్మీదేవిపేట ఎస్సీ కాలనీలో ఆయన విగ్రహానికి బుధవారం అర్ధరాత్రి ఓ వ్యక్తి చెప్పుల దండ వేసి, స్వల్పంగా ధ్వంసం చేశాడు.
ఈ వార్త గురువారం ఉదయం ఆ ప్రాంతంలో దావానంలా వ్యాపించింది. ఈ ఘటనకు పాల్పడిన బుద్ద నూకయ్య కాలనీకి చెందిన కర్రి లీలా సింహభరతరాజును ఎస్సీ కాలనీవాసులు పట్టుకుని, విద్యుత్ స్తంభానికి కట్టివేసి దేహశుద్ధి చేశారు.
రాజుతోపాటు మరో ముగ్గురు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని, అందరినీ కూడా అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించారు. విషయం తెలుసుకున్న ఇన్చార్జి సీఐ జి.ప్రసాదరావు ఎస్సీ కాలనీకి వచ్చి వివరాలు తెలుసుకున్నారు.
ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ కూడా సంఘటనా స్థలానికి వచ్చారు. అంబేద్కర్ విగ్రహంపై వున్న చెప్పుల దండలను తొలగించి, పాలాభిషేకం చేశారు. అంబేద్కర్ అన్ని వర్గాల ప్రజలకు ఆదర్శమని, ఆయనను అవమానపరచడం విచారకరమన్నారు. ఈ సంఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.
ఆ తర్వాత నిందితుడు భరతరాజును పోలీసులు స్టేషన్కు తీసుకువెళ్లారు. ఎస్సీ కాలనీ వాసుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. కాగా నిందితుడు భరతరాజు కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు.