కెసిఆర్, బాబు కలవడం శుభపరిణామం: వెంకయ్య, ఎన్డీఏలోకి టిఆర్ఎస్..
హైదరాబాద్: నాగార్జున సాగర్ జలాలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం సరికాదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఆదివారం నగరంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ సిఎం కె చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమావేశమవడం శుభ పరిణామమని అన్నారు. వివాదాలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని, వివాదాలను తగ్గించుకోవాలని సూచించారు.
ప్రత్యేక హోదా విషయం పరిశీలనలో ఉందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంత సులభం కాదని ఆనాడే చెప్పానని వెంకయ్య ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్డీఏ కూటమిలో తెలంగాణ రాష్ట్ర సమితి చేరడంపై ఎలాంటి ప్రతిపాదనలు లేదని, ఇదంతా మీడియా సృష్టేనని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. పార్టీల మధ్య అవగాహన కుదిర్చే పాత్ర మీడియా పోషించటం సరికాదన్నారు. ఇలాంటి ప్రతిపాదనలు పార్టీల మధ్యే ఉండాలన్నారు. ఏపిలో బిజెపితో తెలుగుదేశం కలిసే ఉందని చెప్పారు.

ఢిల్లీ ప్రజలు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ను రాష్ట్ర స్థాయి నేతగా భావించారని, ప్రధాని నరేంద్ర మోడీని జాతీయ నేతగా భావించి ఎన్నుకున్నారని అన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో తమ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదని చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి, ప్రధాని మోడీకి సంబంధం లేదని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు తమకు సవాల్ విసిరాయని అన్నారు. అయినా ప్రజల తీర్పును గౌరవిస్తామన్నారు.
వచ్చే ఎన్నికల్లో తమ వ్యతిరేక పక్షాలన్నీ ఏకమయ్యే అవకాశం ఉందని వెంకయ్య అభిప్రాయపడ్డారు. దానిని సవాల్ గా స్వీకరిస్తామన్నారు. దేశంలో పేదలకు, ధనికులకు మధ్య అంతరం తగ్గించేందకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. బీహార్లో పరిణామాలకు మోడీకి సంబంధం లేదని, అది జనతా పరివార్ అంతర్గత సమస్య అని వెంకయ్య వెల్లడించారు.












Click it and Unblock the Notifications