జడ్జిలపై జగన్ పార్టీ మరో పిడుగు -అమ్మకానికి హైకోర్టు తీర్పులు -భారీ అవినీతి -ఎంఎస్ బాబు సంచలనం
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీకి, రాష్ట్ర హైకోర్టుకు మధ్య కొనసాగుతోన్న చిటపటలుకాస్తా.. జడ్జిలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫిర్యాదు లేఖతో అగ్నిపర్వతం బద్దలైనట్లయింది. ఆ వేడి చల్లారకముందే వైసీపీకే చెందిన కీలక నేత ఒకరు న్యాయవ్యవస్థపై పిడుగుపాటు వ్యాఖ్యలు చేశారు. జడ్జిలపై జగన్ ఫిర్యాదు వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ కావడం, జడ్జిలపై దూషణల కేసులో వైసీపీ నేతలపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోన్న దరిమిలా తాజా వ్యవహారం ఎక్కడివరకు దారితీస్తుందోననే ఉత్కంఠ రేపుతున్నది. వివరాల్లోకి వెళితే..
ఏపీలో సాయిరెడ్డి వియ్యంకుడి వ్యాక్సిన్? -రజనీలా దమ్ముందా? -జగన్ గుక్కపెట్టి ఏడ్చేలా: ఎంపీ రఘురామ
అనూహ్య తీరుతో వార్తల్లోకి..
చిత్తూరు జిల్లా పూతలపట్టు (ఎస్సీ) నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు తొలి నుంచీ అనూహ్య రీతిలో వార్తల్లో నిలుస్తూ వచ్చారు. ప్రచారంలో పెదవి విప్పకుండానే గెలుపొందిన ఆయన, అసెంబ్లీలో అర్థరహితంగా ప్రమాణస్వీకారం చేసి జాతీయ ఛానెళ్లకూ వార్తాంశమయ్యారు.
లాక్ డౌన్ సమయంలో సొంత పొలంలో వ్యవసాయం చేసి ఆదర్శంగా నిలిచారు. అంతలోనే పూతలపట్టుకు చెందిన అమరజవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి మృతదేహాన్ని తీసుకొచ్చినప్పుడూ అర్థంకాని వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే, వైసీపీకి న్యాయ వ్యవస్థకు మధ్య పితలాటకం కొనసాగుతోన్న క్రమంలో పూతలపట్టు ఎమ్మెల్యే తాజాగా న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
జడ్జిలపై అవినీతి ఆరోపణలు
పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు.. జడ్జిలపై విరుచుకుపడ్డారు. ఇప్పుడు పదవుల్లో కొనసాగుతోన్న వాళ్లు అసలు జడ్జిలేనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పులు అమ్మకానికి ఉన్నాయనే అర్థంలో.. ‘‘ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికే అనుకూలంగా జడ్జిలు జడ్జిమెంట్లు ఇచ్చేస్తారని వైసీపీ ఎమ్మెల్యే ఆరోపించారు. జడ్జిలుగా ఉంటూ అవినీతికి పాల్పడవచ్చా? అని ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా..
పదవులకు మోసం చేస్తున్నారు..
డబ్బులు ఇచ్చిన వాళ్లకు అనుకూలంగా జడ్జిలు తీర్పులు చెబుతున్నారని ఆరోపించిన వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు.. ఈ అవినీతి వ్యవహారంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు పాత్ర కూడా ఉందని పేర్కొనడం గమనార్హం. చంద్రబాబు ఏది చెబితే ఏపీలోని కోర్టుల్లో అవే కీలకంగా, తీర్పులుగా మారుతున్నాయని ఆరోపించారు. ‘‘కొందరైనా జడ్జిలు పేద కుటుంబంలో పుట్టలేదా.. పేదల కష్టాలు మీకు తెలియవా?.. చంద్రబాబు చెప్పిందల్లా కీలకం అవుతున్నప్పుడు జడ్జిలు తమ పదవులకు మోసం చేసినట్లు కాదా?'' అని ఎమ్మెల్యే ఎంఎస్ బాబు అన్నారు. శనివారం పూతలపట్టులో మీడియాతో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే..
కేసీఆర్ ఇన్నింగ్స్ ముగింపు: 2021లో ముఖ్యమంత్రిగా కేటీఆర్ -బెంగాల్ స్ట్రాటజీతో టీబీజేపీ దూకుడు
న్యాయవ్యవస్థపై జగన్ మరో స్ట్రోక్..
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత హైకోర్టు ఇచ్చిన పలు తీర్పుల్లో ప్రభుత్వ విధానాలు, పథకాలు, స్థానిక ఎన్నికలు తదితర విషయాల్లో ఎదురుదెబ్బలు తగలడం, సదరు తీర్పులను ఉద్దేశించి వైసీపీ ప్రజాప్రతినిధులు, కీలక నేతలు, పార్టీ సోషల్ మీడియా విభాగం జడ్జిలపై దూషణలకు దిగడం తెలిసిందే. జడ్జిలపై వైసీపీ నేతలు, శ్రేణుల వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్న హైకోర్టు.. ఆ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. ఈలోపే ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. సుప్రీంకోర్టుకు కాబోయే సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టులోని ఐదుగురు జడ్జిలపై సీజేఐ బోబ్డేకు సంచలన ఫిర్యాదు లేఖ రాశారు. ఈ వ్యవహారాలపై దర్యాప్తు, పరిశీలన కొనసాగుతుండగానే న్యాయవ్యవస్థపై జగన్ మరో స్ట్రోక్ లా అనిపించేలా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు సంచలన ఆరోపణలు చేశారు.
జడ్జిలపై ఫిర్యాదులో జగన్కు అండ?
ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలపై ఫిర్యాదు విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ కు కేంద్రం నుంచి అండదండలు అందుతున్నాయని, అందులో భాగంగానే ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బదిలీ చోటుచేసుకుందని వైసీపీ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. జడ్జిలపై దూషణల కేసులోనూ కేంద్ర సంస్థ సీబీఐ దర్యాప్తు చేస్తున్న తీరు ఈ వాదనకు మరింత బలం చేకూరేలా ఉందని కూడా విశ్లేషకులు అంటున్నారు.
జడ్జిలపై దూషణల కేసులో దర్యాప్తును నిదానంగా సాగిస్తోన్న సీబీఐ.. హైకోర్టు ఇచ్చిన డెడ్ లైన్ ను బేఖాతరు చేస్తూ, నిందితులను ప్రశ్నించడానికి నాలుగు నెలల అదనపు సమయం కావాలని కోరడంతో కేసు విచారణ వచ్చే ఏడాది మార్చి చివరి వారానికి వాయిదా పడింది. జగన్ వర్సెస్ జడ్జిలుగా కొనసాగుతోన్న వ్యవహారాన్ని పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు వ్యాఖ్యలు ఎటువైపునకు తీసుకెళతాయో వేచిచూడాలి..