రఘురామ లేఖ తర్వాత బీజేపీ హైస్పీడ్.. నిమ్మగడ్డ భేటీతో లింకు.. సాయిరెడ్డి ఇరుకున పడ్డారా?
వరుసగా చోటుచేసుకుంటోన్న అనూహ్య పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నాయి. సొంత పార్టీపై ధిక్కారస్వరం వినిపిస్తోన్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు.. వైసీపీ జారీచేసిన షోకాజ్ నోటీసులపై సంచలన రీతిలో స్పందించిన తర్వాత.. ఏపీ బీజేపీ సీఎం జగన్ పై విమర్శల దాడిని ఉధృతం చేసింది.

అందుకే నిమ్మగడ్డపై వివాదం..
చాలా కాలంగా బీజేపీతో సంబంధాలు కొనసాగిస్తున్నారంటూ వైసీపీ ఎంపీ రఘురామపై ఆరోపణలొస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే ఆయన సొంత పార్టీపై తీవ్ర విమర్శలు చేయడం, షోకాజ్ నోటీసులూ అందుకోవడం తెలిసిందే. నర్సాపురం ఎంపీలాగే వైసీపీలోని మరికొందరు ప్రజాప్రతినిధులు, కీలక నేతలు అధినేత జగన్ పై విమర్శలకు దిగిన వైనం ఇటీవల చోటుచేసుకుంది. వైసీపీలో కొనసాగుతోన్న అంతర్గత కుమ్ములాటల నుంచి జనం దృష్టిని మళ్లించడానికే అధికార పార్టీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్వీడియోలను తెరపైకి తెచ్చిందని బీజేపీ ఆరోపించింది.

రఘురామ లేఖకు అటు ఇటుగా..
తనకు జారీ అయిన షోకాజ్ నోటీసుల్లో పార్టీ పేరు ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ' అని కాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ అని ఉండటాన్ని రెబల్ ఎంపీ కృష్ణంరాజు తప్పుపట్టారు. అసలు పార్టీ క్రమశిక్షణా కమిటీకి ఎన్నికల సంఘం గుర్తింపు లేదని, ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందిన వైసీపీకి విజయసాయి రెడ్డి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎలా ఉంటారని ప్రశ్నలు లేవనెత్తారు. సరిగ్గా రఘురామ లేఖ విడుదల చేసిన సమయానికి అటు ఇటుగా ఏపీ బీజేపీ వైసీపీ అంతర్గత కుమ్ములాటలపై వ్యాఖ్యలు చేయడం యాదృచ్ఛికమా, ఉద్దేశపూర్వకంగా జరిగిందా అనే చర్చ నడుస్తోంది.

ఆ స్థితిలో లేమంటూ..
సొంత పార్టీలో కుమ్ములాటలను పరిష్కరించుకోలేక, ఇతరులపై విమర్శలు చేయడమేంటంటూ వైసీపీని బీబీజేపీ తిట్టిపోసింది. ‘‘మీతో నీతులు చెప్పించుకునే స్థాయిలో బీజేపీ లేదు.. మీ ప్రభుత్వ విధానాలపై, మీ ఎంపీ, ఎమ్మెల్యేల నిరసనల నుంచి దృష్టి మరల్చడానికే హోటల్ విషయాన్ని మాట్లాడుతున్నారు. బీజేపీ ఎంపీని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కలుసుకోవడంలో తప్పేముంది, రమేశ్ ను ప్రభుత్వం ఇప్పటికీ ఎస్ఈసీగా గుర్తిస్తున్నదా?'' అంటూ ఏపీ బీజేపీ అధికారిక ఖాతాల్లో కామెంట్లు పెట్టింది.

వైసీపీ స్పందన లేటు..
పార్టీపై ధిక్కార స్వరం వినిపించిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు షోకాజ్ నోటీసు జారీ చేయడంలో నిదానంగా వ్యవహరించిన వైసీపీ.. ఇప్పుడాయన ఘాటు రియాక్షన్ కు రిప్లై ఇచ్చే విషయంలోనూ వ్యూహాత్మక ఆలస్యాన్ని ప్రదర్శిస్తోంది. ఎంపీ రఘురామ తనకు జారీ అయిన షోకాజ్ నోటీసుల చట్టబద్ధతను ప్రశ్నించడంతో అది జారీ చేసిన విజయసాయి రెడ్డి ఇరుకున పడ్డారా? అనే భావన రాజకీయ వర్గాల్లో నెలకొంది. సాధారణంగా ప్రతి అంశంలో నిమిషాల వ్యవధిలోనే మీడియా ముందుకుగానీ, సోషల్ మీడియా ద్వారాగానీ స్పందించే వైసీపీ నేతలు.. రఘురామ ప్రశ్నలపై కిమ్మనకుండా ఉండటం, ఇదే అదనుగా విమర్శల దాడిని పెంచిన బీజేపీని సైతం చూసి చూడనట్లు వదిలేస్తుండం ఆసక్తికర పరిణామంగా మారింది.

వేటు తప్పదనే ఘాటు పెంచారా?
విషయం షోకాజ్ నోటీసుల దాకా వెళ్లినా, సొంత పార్టీ వైసీపీని ఎంపీ కృష్ణంరాజు ప్రశ్నించడం మానలేదుసరికదా.. విమర్శల గాఢతను ఇంకాస్త పెంచడం చర్చనీయాంశమైంది. ఎంపీగా పోటీ చేసేందుకు తనకిచ్చిన బీఫారంలో.. ప్రస్తుతం షోకాజ్ పేరుతో పంపిన నోటీసుల్లో.. పార్టీ పేరు వేర్వేరుగా ఉండటాన్ని రఘురామ తప్పుపట్టారు. అసలు పార్టీలో క్రమశిక్షణా సంఘం ఉందా, ఉంటే మినిట్స్ పంపాలని కోరుతూ పార్టీలో విజయసాయి రెడ్డి హోదాపైనా విమర్శలు చేశారు. తన చర్యలకు వేటు తప్పదని స్పష్టంగా తెలిసే.. ఎంపీ ఈ మేరకు విమర్శల డోసు పెంచారనే భావన పార్టీల్లో వ్యక్తమవుతోంది. అయితే, షోకాజ్ నోటీసుల్లో పేర్కొన్న గడువు ముగిసిన తర్వాతే ఆయనపై వేటు నిర్ణయాన్ని వైసీపీ అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications