గ్రేటర్ వ్యూహం: కేసీఆర్కి ధీటుగా అమిత్షా, పాతబస్తీలో
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్లో బీజేపీ 80 సీట్లకు గాను 73 సీట్లు గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించిన ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా.. తెలంగాణలోని హైదరాబాదులో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ/తమ కూటమి గెలుపొందేందుకు వ్యూహరచన చేయనున్నారట. ఈ ఏడాది చివర్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. హైదరాబాదు పైన బీజేపీ పట్టు సాధించేందుకు... ఎక్కువ కార్పోరేటర్లను గెలుచుకునేందుకు షా వ్యూహాలను రాష్ట్ర నేతలు తీసుకోనున్నారట.
అమిత్ షా ఈ నెల 20వ తేదీన హైదరాబాద్ వస్తున్నారు. రెండు రోజుల పాటు ఉంటారు. ఈ సమయంలో ఆయన జీహెచ్ఎంసీ గురించిన విషయాలను స్థానిక నేతలతో చర్చించనున్నారు. పార్టీ సీనియర్ నేతలు, డివిజన్ స్థాయి నేతలను కూడా షా కలిసి చర్చించనున్నారని తెలుస్తోంది.
తెరాస-మజ్లిస్ వర్సెస్ బీజేపీ-టీడీపీ
రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు తెరాస-మజ్లిస్ వర్సెస్ బీజేపీ-టీడీపీగా ఉండనున్నాయి. జీహెచ్ఎంసీలో 150 డివిజన్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ 55, టీడీపీ 44, మజ్లిస్ 43 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ నాలుగైదు స్థానాలనే గెలుచుకుంది. తెరాస పోటీ చేయలేదు. టీడీపీతో కలిసి పోటీ చేసి ఈసారి కొన్ని ఎక్కువ స్థానాలను గెలుచుకోవాలని బీజేపీ భావిస్తోంది.
హైదరాబాదులో తెరాస...
తెలంగాణలోని ఇతర జిల్లాలతో పోలిస్తే హైదరాబాదులో తెరాస ప్రభావం కొంత తక్కువ. దీంతో మజ్లిస్ పార్టీతో కలిసి వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పుడు అధికారంలో కూడా తెరాసనే ఉండటం కలిసి వస్తుందని భావిస్తున్నారు.
ఎక్కువ స్థానాల్లో టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు
నగరంలో ఎక్కువ స్థానాల్లో బీజేపీ, టీడీపీ ఎమ్మెల్యేలు ఉండటంతో కేసీఆర్ వ్యూహాత్మకంగా మజ్లిస్ పార్టీతో కలిసి వెళ్లాలని భావిస్తున్నారు. ముషీరాబాద్, అంబరుపేట, ఖైరతాబాద్, ఉప్పల్, గోషామహల్ అసెంబ్లీలను బీజేపీ, జూబ్లీహిల్స్, సనత్ నగర్, ఎల్బీ నగర్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, కంటోన్మెంట్ అసెంబ్లీలను టీడీపీ గెలుచుకుంది. తెరాస సికింద్రాబాద్, మల్కాజిగిరి అశెంబ్లీలను గెలుచుకుంది. మజ్లిస్ పార్టీ పాతబస్తీలో ఏడు స్థానాల్లో గెలిచింది.
టీడీపీతో కలిసి గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తే తమకు పాతబస్తీలో లాభిస్తుందని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో యూపీలో ఎక్కువ స్థానాలను గెలిపించిన అమిత్ షా వ్యూహాలు తోడైతే బాగుంటుందని రాష్ట్ర నేతలు, స్థానిక నేతలు భావిస్తున్నారు. 20, 21వ తేదీల్లో హైదరాబాదులో ఉండే అమిత్ షా పార్టీ నేతలకు జీహెచ్ఎంసీ గెలుపుపై పలు సూచనలు చేయనున్నారు. అనంతరం గ్రేటర్లో టీడీపీ, బీజెపి గెలుపు కోసం ఆయన వ్యూహాలు రచించి చెప్పనున్నారు.