జూ ఎన్టీఆర్ కు అమిత్ షా "ఆహ్వానం" - ఏకాంత చర్చలు : ఫిక్స్ అయ్యారా - ఏం జరిగింది..!!
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ భేటీ ఆసక్తిని రేకెత్తించింది. సీనీ - రాజకీయ వర్గాల్లోనూ చర్చకు కారణమైంది. హైదరాబాద్ వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రత్యేకంగా సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ ను విందుకు ఆహ్వానించారు. మునుగోడులో బహిరంగ సభ పూర్తయిన తరువాత షా రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లారు. అక్కడ నుంచి నేరుగా శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్ కు చేరారు. అప్పటికే అక్కడకు జూనియర్ అక్కడకు చేరుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తానే జూ ఎన్టీఆర్ ను అమిత్ షా వద్దకు తీసుకెళ్లారు.
2. |
స్వయంగా పుష్పగుచ్చం ఇచ్చి ఆహ్వానం
జూ ఎన్టీఆర్ ను ఆహ్వానించిన అమిత్ షా.. తన వద్దకు తారక్ రాగానే పుష్పగుచ్చంతో "ఆహ్వానం" పలికారు. జూనియర్ సైతం కేంద్ర మంత్రిని శాలువాతో సత్కరించారు. దాదాపు 45 నిమిషాల పాటు సాగిన సమావేశంతో..అమిత్ షా - జూ ఎన్టీఆర్ 30 నిమిషాలకు పైగా ఏకాంతంగా చర్చలు జరిపారు. ఆ తరువాత మరో కలిసి భోజనం చేసారు. ఈ భేటీలో సినిమాలతో పాటుగా రాజకీయ అంశాల పైన వీరిద్దరి మధ్య చర్చలు జరిగినట్లుగా విశ్వసనీయ సమాచారం. అమిత్ షా ప్రధానంగా సీనియర్ ఎన్టీఆర్ సినిమాలు.. పాలన గురించి ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. సీనియర్ ఎన్టీఆర్ నటించిన విశ్వామిత్ర..దానవీర శూరకర్ణ వంటి సినిమాలు చూశానని చెప్పారు. అదే సమయంలె ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారులు బాగా పని చేశారని అమిత్ షా వ్యాఖ్యానించారు.
అరగంట పాటు ఏకాంత భేటీ
కానీ, చంద్రబాబు పాలన గురించి ప్రస్తావనకు రాలేదని తెలుస్తోంది. తెలిసింది. అనంతరం అమిత్షా ఈ భేటీపై ట్వీట్ చేశారు. ''అత్యంత ప్రతిభావంతుడైన నటుడు.. తెలుగు సినిమా తారకరత్నం అయిన జూనియర్ ఎన్టీఆర్తో ఈ రోజు హైదరాబాద్లో మాట్లాడటం చాలా ఆనందంగా అనిపించింది'' అని ట్వీట్ లో పేర్కొన్నారు. రాజకీయ వ్యూహాల్లో దిట్ట అయిన అమిత్ షా.. ఏం చేసిన రాజకీయ ప్రయోజనాలతో చేస్తారనేది పొలిటికల్ సర్కిల్స్ లో అందరూ అంగీకరించే అంశం. దీంతో..జూనియర్ ఎన్టీఆర్ ను సినిమా నటుడిగా అభినందించేందుకే ఈ భేటీ అయితే..ఏకాంతంగా అంతసేపు చర్చలు ఉంటాయా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయంగా తెలంగాణ..ఆ తరువాత ఏపీలో పట్టు పెంచుకోవాలని బీజేపీ వ్యూహంగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటుగా.. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కొన్ని సామాజిక - ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా ఓట్లను ఆకర్షించేందుకు జూనియర్ తమతో ఉన్నారనే సంకేతాలు ఇచ్చేందుకు అమిత్ షా ఈ భేటీ ద్వారా ప్రయత్నించారనేది విశ్లేషకుల వాదన.
భవిష్యత్ అసవరాల కోసం ముందస్తుగా
2009 ఎన్నికల సమయంలో జూ ఎన్టీఆర్ టీడీపీకి మద్దతుగా ప్రచారం చేసారు. అప్పట్లోనే పెద్ద ఎత్తున జన స్పందన వచ్చింది. దీంతో..భవిష్యత్ రాజకీయాల్లో బీజేపీకి జూ ఎన్టీఆర్ అవసరం ఉంటుందని..అందులో భాగంగా ముందస్తు వ్యూహంలో ఈ భేటీ జరిగిందని అంచనా వేస్తున్నారు. కానీ, తారక్ ప్రాణం ఉన్నంత వరకూ టీడీపీతోనే ఉంటానని గతంలో ప్రకటించారు. ఇద్దరి మధ్య ఏకాంత చర్చల్లో జూనియర్ ను బీజేపీకి మద్దతుగా నిలవాలని.. జూ ఎన్టీఆర్ మేనత్త పురంధేశ్వరి తరహాలో పార్టీకి పని చేయాలని కోరారంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే, అమిత్ షా సడన్ గా హైదరాబాద్ లో జూనియర్ ను ఆహ్వానించటం.. ఏకాంతంగా చర్చలు చేయటం టీడీపీలో మాత్రం కొంత గుబులు రేపుతోంది.
జూ ఎన్టీఆర్ అడుగుల పై ఆసక్తి
జూ ఎన్టీఆర్ సినిమాల పైనే ప్రస్తుతం ఫోకస్ పెట్టారు. ఇప్పటికిప్పుడు రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి కెరీర్ పైన ప్రభావం పడే నిర్ణయాలు తీసుకోరనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అమిత్ షా ఆహ్వానించారు..జూనియర్ వెళ్లారు.. అక్కడ ఏకాంత చర్చల సమయంలో "ఆఫర్లు" వచ్చినా.. తారక్ మాత్రం రాజకీయ నిర్ణయాలు అంత త్వరగా తీసుకొనే అవకాశం లేదు. కానీ, భవిష్యత్ లో జూనియర్ ఎన్టీఆర్ అవసరం గుర్తించే అమిత్ షా యంగ్ టైగర్ ను ఆహ్వానించారని చెబుతున్నారు. దీంతో.. ఇప్పుడు ఈ భేటీ రాజకీయంగా బిగ్ డిబేట్ గా మారుతోంది.