మిత్రపక్షమైనా, తగ్గేది లేదు: చంద్రబాబుకు మోడీ హెచ్చరిక
విజయవాడ: తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీ ఢీ అంటే ఢీలా వెళ్లాలని భావిస్తోందా? ఇక, ప్రజా సమస్యల పైన చంద్రబాబును మరింత నిలదీయాలని భావిస్తున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
గత సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి - బిజెపిలు మిత్రపక్షాలుగా పోటీ చేశాయి. కేంద్రంలో టిడిపి, ఏపీలో బిజెపి ప్రభుత్వంలో ఉన్నాయి. అయితే, అప్పుడప్పుడు ఆ రెండు పార్టీల మధ్య విభేదాలు, గొడవలు కనిపిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా, బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పేరు మరోసారి తెరపైకి వచ్చింది.
ఏపీ బీజేపికి కొత్త అధ్యక్షుడిగా సోము వీర్రాజు..! అసంతృప్తితో వెళ్లిపోయిన సీనియర్ నేత
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా దాదాపు సోము వీర్రాజునే నియమించే అవకాశాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు పైన దూకుడుగా వెళ్లాలని బీజేపీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు జాతీయ అధ్యక్షులు అమిత్ షా, ప్రధాని మోడీ కూడా పచ్చ జెండా ఊపారని, అందుకే వీర్రాజు వైపు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు.
ఇతర బిజెపి నేతల విషయం పక్కన పెడితే, సోము వీర్రాజు చాలాసార్లు చంద్రబాబు ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోసిన సందర్భాలు ఉన్నాయి.
ప్రత్యేక హోదా తీసుకు వస్తే నిధుల లెక్క చెప్పాలని, అసలు ఇచ్చిన హామీలు ఎక్కడ అమలవుతున్నాయని పలుమార్లు నిలదీశారు. చంద్రబాబుపై దూకుడుగా ఉండే వీర్రాజును అధ్యక్షుడిగా చేయాలనుకోవడం వెనుక బీజేపీ ప్లాన్గానే ఉందని అంటున్నారు. వీర్రాజును అధ్యక్షుడిగా చేస్తే అది చంద్రబాబుకు హెచ్చరికే అంటున్నారు.
మిత్రపక్షమైనా..
బిజెపి ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కంకణబద్ధులై ఉంటుందని చిత్తూరు పార్టీ జిల్లా అధ్యక్షుడు చంద్రారెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యురాలు శాంతారెడ్డి సంయుక్తంగా తెలిపారు. శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీసరస్వతి ఆడిటోరియం ఆవరణలో గురువారం బీజేపీ జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది.
హద్దులు దాటొద్దు! అదే విషయం చంద్రబాబుకు చెప్తా: అమిత్ షా
కార్యక్రమానికి భాజపా కీలక నేతలు పలువురు హాజరయ్యారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ.. అధికార పార్టీ అయిన టిడిపితో తాము మిత్రపక్షం అయినప్పటికీ ప్రజల పక్షమని, ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా ముందుండి పోరాడేందుకు బీజేపీ సిద్ధంగా ఉంటుందన్నారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించే విధంగా చూడాలన్నది లక్ష్యం చేసుకున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను అట్టడుగు స్థాయి నుంచి అందరికి అవగాహన కల్పించాల్సి ఉందని, దీనిపై పార్టీ శ్రేణులు సైనికుల్లా పని చేయాలన్నారు.