వైఎస్సార్ బిడ్డ అనిపించుకున్నారు: నారా లోకేష్ కంటే బెటర్..: ఆ ఫేస్ కట్ అలాంటిది
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సంచలనంగా మారిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా-జూనియర్ ఎన్టీఆర్ భేటీ పట్ల లోక్సభ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. ఎలాంటి కారణాలు లేనిదే అమిత్ షా ఏ పనీ చేయబోడని, జూనియర్ ఎన్టీఆర్ను కలవడాన్ని తాను రాజకీయ కోణంలోనే చూస్తోన్నానని వ్యాఖ్యానించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ను వాడుకోవడానికే అధిక అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

మెరుగైన రాజకీయ పరిజ్ఞానం..
అమిత్ షా-జూనియర్ మధ్య చర్చకు వచ్చిన అంశాలేమిటనేది తనకు తెలియదని, ఈ సమావేశం మాత్రం రాజకీయంగానే ఉంటుందని తేల్చి చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్కు అన్ని విషయాలపై అవగాహన ఉందని, ఆయన సమకాలీకుల కంటే మెరుగైన రాజకీయ పరిజ్ఞానం ఉందని పరోక్షంగా నారా లోకేష్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి నిర్ణయాలను తీసుకోవాలో ఆయన తెలుసని, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాడని భావిస్తున్నట్లు చెప్పారు.

అమిత్ షా కలవడానికి..
జూనియర్ ఎన్టీఆర్ను చంద్రబాబు పార్టీకి దూరంగా పెట్టిన ప్రస్తుత పరిస్థితుల్లో అమిత్ షా ఆయనను కలవడం వెనుక ఇతరత్రా కారణాలేమీ ఉండవని స్పష్టం చేశారు. అటు ఎన్టీఆర్కు కూడా రాజకీయాలపై ఆసక్తి ఉందని, దీన్ని సొమ్ము చేసుకోవడానికే అమిత్ షా ఆయనను కలిసి ఉండొచ్చని చెప్పారు. 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్టీఆర్ విస్తృతంగా ప్రచారం చేయడం, మహానాడు వంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం దీనికి నిదర్శనమని ఉండవల్లి అన్నారు.

సీనియర్ ఎన్టీఆర్లా
జూనియర్ ఎన్టీఆర్ ఇదివరకు చేసిన కొన్ని రాజకీయపరమైన ఉపన్యాసాలు, సినిమా వేదికల మీద చేసిన స్పీచ్లను తాను విన్నానని ఉండవల్లి చెప్పారు. అతనిలో మంచి ఎక్స్ ప్రెషన్ ఉన్నాయని..సీనియర్ ఎన్టీఆర్లా కనిపిస్తాడని కితాబిచ్చారు. ఇప్పటి వారికి సీనియర్ ఎన్టీఆర్ గురించి అంత పెద్దగా తెలియకపోయినా, తమ తరానికి సీనియర్ ఎన్టీఆర్ ఫేస్ కట్ జూనియర్లో కనిపిస్తుందని చెప్పుకొచ్చారు. హరికృష్ణ మీద వ్యక్తిగతంగా తనకు మంచి అభిప్రాయం ఉందని, తండ్రిలాగా మాట్లాడతారని చెప్పారు.

వైఎస్ఆర్ బిడ్డ..
మార్గదర్శి చిట్ఫండ్ కేసు విషయంలో ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ కావడాన్ని మంచి పరిణామంగా ఉండవల్లి అరుణ్ కుమార్ అభివర్ణించారు. ఈ విషయంలో ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆలోచనలను విస్మరించలేదని.. వైఎస్సార్ బిడ్డ అనిపించుకున్నారని ప్రశింసించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉందని, ఉండవల్లి చెప్పారు. సుప్రీంకోర్టు విచారణతో మార్గదర్శి అవినీతి బట్టబయలవుతుందని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications