హద్దులు దాటొద్దు! అదే విషయం చంద్రబాబుకు చెప్తా: అమిత్ షా
న్యూఢిల్లీ: ఏపీలో బీజేపీ - తెలుగుదేశం పార్టీలలోని కొందరు నేతల పరస్పర విమర్శలు, పార్టీల మధ్య కొన్ని విభేదాల పైన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా శుక్రవారం నాడు కీలక వ్యాఖ్యలు చేశారు. పరస్పరం విమర్శలు తగవని ఆయన వ్యాఖ్యానించారు. తద్వారా అందరూ హద్దుల్లో ఉండాలని సూచించారు.
ఏపీ బీజేపికి కొత్త అధ్యక్షుడిగా సోము వీర్రాజు..! అసంతృప్తితో వెళ్లిపోయిన సీనియర్ నేత
ఏపీ బీజేపీ కోర్ కమిటీకి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ రోజు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండి పరస్పర విమర్శలు తగవని హితవు పలికారు. లోటుపాట్లు ఉంటే చర్చించుకోవాలి లేదా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలన్నారు.
ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. టిడిపి అధినాయకత్వానికి కూడా ఇదే విషయం స్పష్టం చేస్తామని అమిత్ షా అన్నారు. ఆ పార్టీ వాళ్లు కూడా బీజేపీని లక్ష్యంగా చేసుకుంటే తాను చెబుతానని ఆయన వ్యాఖ్యానించారు.
కాగా, ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఏపీ కోర్ కమిటీ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్, రాష్ట్ర ఇంఛార్జ్ రామ్ మాధవ్, సీనియర్ నేతలు మురళీధర రావు, ఏపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు, ఎంపీ హరిబాబు తదితరులు సమావేశానికి హాజరయ్యారు.
మిత్రపక్షమైనా, తగ్గేది లేదు: చంద్రబాబుకు మోడీ హెచ్చరిక
ప్రత్యేక హోదా, కేంద్రం నిధులు పైన తెలుగుదేశం పార్టీ నేతలు కొద్ది రోజుల క్రితం బీజేపీ పైన మండిపడ్డారు. ప్రతిగా ఏపీ బీజేపీ నేతలు పోలవరం ప్రాజెక్టు, అవినీతి, కేంద్రం నిధుల లెక్క చెప్పాలని కౌంటర్ ఇచ్చారు. ఇటీవల విజయవాడలో దేవాలయాల కూల్చివేతపై బీజేపీ భగ్గుమంది. ఈ నేపథ్యంలో అమిత్ షా బీజేపీ నేతలకు సూచనలు చేశారు.