బాబును ఏమనలేదు, వారు కలిస్తే మంచిదే: సోము వీర్రాజు, అమిత్ షా వార్నింగ్పై ఇలా
Recommended Video
విజయవాడ: బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిన్న బంద్ (గురువారం-08-02-2018) రోజు తమను బయటకు రాకుండా చేసిందని, ఇంత జరుగుతుంటే హోంమంత్రి ఏం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
వీరి తీరు ఘోరం, ఇందుకేనా, తేల్చుకుందాం: మోడీ-జైట్లీపై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు
తన గొంతు నొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కర్నూలు సభలో తాను చంద్రబాబును ఉద్దేశించి ఏమీ అనలేదని తేల్చి చెప్పారు.
పవన్, జేపీ, ఉండవల్లి కలిస్తే మంచిదే
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, లోక్సత్తా జయప్రకాశ్ నారాయణతో కలిసి జేఏసీ ఏర్పాటు చేస్తే మంచిదేనని చెప్పారు. ఏపీకి తీవ్ర అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీతో టీడీపీ జత కలిస్తే ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయని సోము వీర్రాజు ప్రశ్నించారు.
వైసీపీ కోవర్టు అంటే నవ్వొస్తుంది
తనను టిడిపి వైసీపీ కోవర్టు అంటే నవ్వు వస్తోందని సోము వీర్రాజు అన్నారు. ఏపీకి కేంద్రం ఏమిచ్చిందో లెక్కలు తీయాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఏం చేసింది, రాష్ట్రం ఏం చెబుతోంది అన్నీ తీయాలన్నారు. కేంద్రం నిజంగా ఏపీకి అన్యాయం చేసిందా లెక్కలు తీస్తే తెలుస్తుందన్నారు.
పెద్దలు ఢిల్లీకి వెళ్లి మాట్లాడాలి
ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధులపై పెద్దలు ఢిల్లీకి వెళ్లి మాట్లాడాలని సోము వీర్రాజు సూచించారు. రాష్ట్రంలో ఆందోళనలకు ఫుల్ స్టాప్ పెట్టవలసి ఉందని చెప్పారు. ప్రభుత్వం తనను బంద్ రోజు బయటకు రాకుండా చేసిందన్నారు.
అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారన్న వార్తలపై
బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా తనకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారన్న వార్తలపై సోము వీర్రాజు స్పందించారు. అమిత్ షా తనను మందలించలేదన్నారు. తన గొంతు నొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కావాలంటే తన కాల్ లిస్ట్ చూసుకోవాలన్నారు. కాగా, సోము వీర్రాజుపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారని వార్తలు వచ్చాయి. మిత్రపక్షం టిడిపి గురించి మాట్లాడే అధికారం నీకు ఎవరు ఇచ్చారని అధిష్టానం నిలదీసిందని, మిత్రధర్మం, వచ్చే ఎన్నికల్లో పొత్తులపై ఎందుకు మాట్లాడుతున్నారని, వ్యక్తిగత అజెండాతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దని, ఇలాగే మళ్లీ మాట్లాడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించినట్లుగా వార్తలు వచ్చాయి.