విశాఖలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో అపశృతి .. పలువురికి గాయాలు
ఒకపక్క ఏపీలో ఎండల వేడితో పాటు పొలిటికల్ హీట్ కూడా తారాస్థాయికి చేరుతుంది. సభలు, సమావేశాలు , రోడ్ షో లతో నేతలు ప్రజలమద్దతు కూడగట్టే ప్రయత్నంలో ఉన్నారు. ప్రధాన పార్టీలైన టీడీపీ , వైసీపీ లతో పాటు జనసేన కూడా ఎన్నికల ప్రచారంలో ముందు వరుసలో ఉంది. ఇక పవన్ కళ్యాణ్ కు ప్రజల మద్దతు ఓటు బ్యాంకుగా మారుతుందో లేదో కానీ ఆయన సభలకు మాత్రం జనం పోటెత్తుతున్నారు. తాజాగా విశాఖలో జరిగిన సభలో కూడా జనం పెద్ద ఎత్తున తరలి రావటంతో సభలో ఒక అపశృతి చోటు చేసుకుంది.

విశాఖలో పవన్ కళ్యాణ్ సభలో అపశృతి
విశాఖలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించిన బహిరంగసభలో అపశృతి చోటు చేసుకుంది. గురువారం నాడు నగరంలోని 80 ఫీట్ రోడ్డులో జరిగిన ఈ సభకు జనం భారీగా తరలివచ్చారు.ఉదయం 10 గంటలకు పవన్ ఇక్కడికి రావాల్సి ఉండగా.. గాజువాకలో మీటింగ్ అనంతరం 1.30కి బహిరంగసభ వద్దకు చేరుకున్నారు. జనసేనాని రాకతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా జనసేనానికి స్వాగతం పలుకుతూ కేకలతో మారుమ్రోగింది.

సౌండ్ బాక్సులు ఉన్న స్టాండ్ కూలి పలువురికి గాయాలు
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను చూడటానికి యువత, మహిళలు ఒక్కసారిగా ఎగబడటంతో తోపులాట జరిగింది. మైకులు పెట్టే బాక్స్ స్టాండ్ పైకి ఎక్కి మరి పవన్ను చూసేందుకు చాలా మంది నిలబడ్డారు. అయితే చాలా మంది స్టాండ్ పైకి ఎక్కటంతో బరువును ఆపుకోలేక ఆ స్టాండ్ కూలిపోయింది. దీంతో దానిపై ఎక్కిన వారు కింద వున్న వారిపై పడ్డారు. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడగా, ఓ మీడియాకు సంస్థకు చెందిన ఫోటోగ్రాఫర్కు కాలు విరిగిపోయింది. దగ్గర్లో ఎక్కువ మంది లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ఎన్నికల ప్రచారంలో తరచూ ఈ తరహా సంఘటనలు ... జాగ్రత్త అవసరం
ఎన్నికల ప్రచారం ప్రారంభం అయిన నాటి నుండి ఏపీలో ఈ తరహా ఘటనలు చాలానే జరిగాయి. కొందరు ప్రాణాలు సైతం కోల్పోయారు. రాజకీయ నాయకుల ప్రసంగాలపై ఆసక్తితో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సభలకు వెళ్ళినా సురక్షిత ప్రదేశాలలో కాకుండా గోడల మీద , చెట్ల మీద , సౌండ్ బాక్సులు పెట్టే స్టాండ్స్ మీద కూర్చుని ప్రమాదాల బారిన పడుతున్నారు. తాజా ఘటనలో ఎవరికీ ప్రాణహాని లేకున్నా చాలామంది గాయాలపాలయ్యారు .












Click it and Unblock the Notifications