జగన్ ఏపీ భవిష్యత్ నాశనం చేస్తున్నారు..పరిశ్రమలు ఎలా వస్తాయి : పారిశ్రామిక వేత్త ట్వీట్ కలకలం..!!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కొద్ది రోజులుగా తీసుకుంటున్న నిర్ణయాల పైన ఇంకా విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. జగన్ తాను ఎందుకు ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందీ వివరణ ఇచ్చినా విమర్శలు మాత్రం ఆగటం లేదు. తాజాగా జరిగిన రాయబారుల సదస్సులో..స్వతంత్రి దినోత్సవం ప్రసంగంలోనూ జగన్ తన ఉద్దేశం ఏంటో స్పష్టం చేసారు. రెండు రోజుల క్రితం జపాన్ కంపెనీలు నేరుగా కేంద్రానికి అదే విధంగా ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసారు. ప్రభుత్వ నిర్ణయాలను తప్పు బడుతూ లేఖలు రాసాయి. ఇక, ఇప్పుడు తాజాగా కర్నాటక కు చెందిన ఒక పారిశ్రామిక వేత్త సైతం అదే అభిప్రాయం వ్యక్తం చేసారు. ఏపీలో పీపీఏల పై సమీక్ష చేయటంపైన ఆయన అభ్యంతరం వ్యక్తం చేసారు. ఏపీ భవిష్యత్ను జగన్ నాశనం చేస్తున్నారన్నారని తన ట్వీట్ లో పేర్కొన్నారు.

ఏపీని కుప్పకూల్చేలా వ్యవహరిస్తున్నారు..
ఏపీ ప్రభుత్వం పీపీఏల సమీక్ష పైన తీసుకున్న నిర్ణయాల పైన ఇప్పటికే అనేక అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ వ్యవహారం హైకోర్టు పరిధిలో ఉంది. ఇదే సమయంలో జపాన్ కు చెందిన కంపెనీలు నేరుగా కేంద్ర ప్రభుత్వానికి అదే సమయంలో ఏపీ ప్రభుత్వానికి తమ అభ్యంతరాలు తెలుపుతూ లేఖలు రాసాయి. ఇక, ఇప్పుడు కర్నాటక కు చెందిన ఒక పారిశ్రామిక వేత్త మోహన్ దాస్ పాయ్ సంచలన ట్వీట్ చేశారు.
పీపీఏలపై ప్రభుత్వం సమీక్ష జరపడంపై మోహన్దాస్ పాయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. జపాన్ కంపెనీలు లేఖ రాసిన తర్వాత అయినా నిర్ణయం మార్చుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వమే ఈ విధంగా వ్యవహరిస్తే ఏపీకీ పరిశ్రమలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. పరిశ్రమలను దెబ్బ తీసి ఏపీని కుప్ప కూల్చేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఏపీ భవిష్యత్ ను ముఖ్యమంత్రి జగన్ నాశనం చేస్తున్నారని ట్వీట్ లో వ్యాఖ్యానించారు. మోహన్ దాస్ పాయ్ తన ట్వీట్ ను నేరుగా ముఖ్యమంత్రి జగన్ కే ట్యాగ్ చేసారు. ఈ మోహన్ దాస్ పాయ్ ఆర్యన్ క్యాపిటల్ అధినేతగా.. అక్షయపాత్ర సహ వ్యవస్థాపకుడి గా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో కర్నాటకలోని పలు కంపెనీల్లో ఆయన స్వతంత్ర డైరెక్టర్ గా కొనగుతున్నారు. ఇప్పుడు కర్నాటకకు చెందిన పారిశ్రామిక వేత చేసిన ఈ ట్వీట్ పైన ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. వీటికి ఏ రకంగా సమాధానం ఇవ్వాలనే దాని పైన చర్చలు చేస్తోంది.

కేంద్ర ప్రభుత్వం..జపాన్ కంపెనీలు సైతం..
ముఖ్యమంత్రి జగన్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల ను సమీక్షించాలని నిర్ణయించిన సమయం నుండి అభ్యంతరాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. తొలుత కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసారు. అయితే, ఈ లేఖ పైన ముఖ్యమంత్రి జగన్ తిరుమల వచ్చిన సమయంలో నేరుగా ప్రధానితో చర్చించారు. అవినీతి జరిగి ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందేనని ప్రధాని సైతం వ్యాఖ్యానించటంతో ముఖ్యమంత్రి ఇక వెనుకడుగు వేయలేదు. ఆ తరువాత నేరుగా కేంద్ర మంత్రి దీని పైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ నేరుగా ముఖ్యమంత్రికి లేఖ రాసారు. హోం మంత్రి అమిత్ షా కు ఫిర్యాదు చేసారు. ఇదే సమయంలో పవర్ కంపెనీలు హైకోర్టును ఆశ్రయించాయి. న్యాయస్థానం స్టే ఇచ్చింది. ప్రస్తుతం ఆ వ్యవహారం కోర్టులో ఉంది. దీనికి కొనసాగింపుగా తాజాగా జపాన్ కంపెనీలు నేరుగా కేంద్ర ప్రభుత్వానికి అదే సమయంలో ఏపీ ప్రభుత్వానికి లేఖలు రాసింది. ఏపీ ప్రభుత్వం లో పీపీఏ ల మీద సమీక్ష చేస్తే వ్యాపార పరంగా ఇబ్బందులు వస్తాయని అభ్యంతరం వ్యక్తం చేసింది. దీని పైన కేంద్రం సైతం అప్రమత్తమైంది. దీని పైన చర్చ సాగుతుండగానే నేరుగా ఒక పొరుగు రాష్ట్ర పారిశ్రామిక వేత్త ఏపీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలతో ట్వీట్ చేసారు.

ముఖ్యమంత్రి జగన్ వివరణ ఇస్తూనే..ముందుకే
ముఖ్యమంత్రి జగన్ తాను తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమే అని అంగీకరిస్తూనే వాటి వెనుక కారణాలు విశ్లేషించారు. గత వారం విజయవాడలో జరిగిన 35 దేశాల రాయబారుల సదస్సులో విద్యుత్ ధర తగ్గించేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని వివరించారు. అదే విధంగా స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలోనూ విద్యుత్ ధరలు తగ్గించమని కోరితే నానా యాగీ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.
తన మీద ఈ నిర్ణయాల పైన అనేక రకాలుగా ఒత్తిడి ఉందని సీఎం వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయాలను విప్లవాత్మక నిర్ణయాలంటూ ప్రభుత్వం చెప్పుకొనే ప్రయత్నం చేస్తున్నా..ఇలా అంతర్జాతీయ స్థాయి నుండి పొరుగు రాష్ట్ర ప్రతినిధుల వరకు అభ్యంతరం వ్యక్తం చేస్తుండటంతో..చివరకు ఇది ఎటు దారి తీస్తుందో అనే ఉత్కంఠ ఏపీ ప్రభుత్వంలో కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications