ఉత్తరాంధ్రకు మరో భారీవరం.. అనకాపల్లి ఇండస్ట్రియల్ హబ్ పై సీఎం చంద్రబాబు కీలకప్రకటన!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అనకాపల్లి అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. అనకాపల్లి దశ త్వరలోనే మారబోతుందని అన్నారు. అనకాపల్లి కేవలం బెల్లానికి మాత్రమే పరిమితం కాదని, రాబోయే రోజుల్లో దేశంలోనే అత్యుత్తమ ఇండస్ట్రియల్ హబ్గా ఆవిర్భవిస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలు అభిమానించడమే తమకు అసలైన తృప్తినిస్తుందని పేర్కొన్నారు.
విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ పై అసత్య ప్రచారం చేస్తున్నారన్న సీఎం
సమాజానికి మంచి చేసే ప్రతి పనిలోనూ సవాళ్లు, విమర్శలు ఎదురవుతాయని, అయినప్పటికీ అభివృద్ధి ప్రయాణం ఆగదని తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తుంటే కొందరు వీటిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ వస్తే నీటిఎద్దడి తలెత్తుతుందని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. డేటా సెంటర్ ఇంకా ప్రారంభమే కాకముందు నీళ్లు ఇంకిపోయాయని చెప్పడం వారి అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు.

ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్న చంద్రబాబు
ఇలాంటి తప్పుడు సమాచారంతో ప్రజలను భయపెట్టే ప్రయత్నాలను ప్రజలంతా తిప్పి కొట్టాలని సూచించారు. ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా త్వరలోనే అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలకు గోదావరి జలాలను తరలిస్తామని హామీ ఇచ్చారు. సెప్టెంబర్ తొలి వారంలోనే ఈ పనులను పూర్తి చేసి చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా గోదావరి జలాల తరలింపు వేగవంతం
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా గోదావరి జలాల తరలింపును వేగవంతం చేస్తామని చెప్పారు. దీనివల్ల ఉత్తరాంధ్ర ప్రాంతంలో నీటి సమస్య తీరి, పారిశ్రామిక అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతికి అత్యాధునిక క్వాంటమ్ కంప్యూటింగ్ సాంకేతికత రావడం రాష్ట్రానికే గర్వకారణమని సీఎం హర్షం వ్యక్తం చేశారు.
అనకాపల్లిని పారిశ్రామిక కేంద్రంగా మార్చడం ద్వారా ఉపాధి అవకాశాలు
మంచి పనులను అడ్డుకోవాలని చూసే విమర్శలను పక్కనపెట్టి, పరిశ్రమల స్థాపన, మౌలిక వసతుల కల్పనతో ప్రాజెక్టులను వేగంగా ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. అనకాపల్లిని పారిశ్రామిక కేంద్రంగా మార్చడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు చంద్రబాబు. స్థానిక యువతకు మంచి భవిష్యత్తు ఏర్పడుతుందని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని, ప్రజల సహకారంతోనే అనుకున్నది సాధిస్తామన్నారు సీఎం చంద్రబాబు.













Click it and Unblock the Notifications