ఏపీలో హిస్టరీ రిపీట్ : కూటమి Vs సింగిల్ - సర్వేలు తేల్చిందేంటి...!!
ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. సీఎం జగన్ అభ్యర్దుల ఖరారు ప్రక్రియ వేగవంతం చేసారు. సింగిల్ గానే పోటీ చేస్తానని..తన సంక్షేమమే తనను గెలిపిస్తుందనే ధీమాతో ఉన్నారు. జగన్ ఓటమి లక్ష్యంగా టీడీపీ, జనసేన పొత్తుతో బరిలోకి దిగుతున్నాయి. బీజేపీ కలిసి వస్తుందా లేదా అనేది స్పష్టత లేదు. ఇటు షర్మిలపైన ఆశలతో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ పెంచుకొనే ప్రయత్నాలు చేస్తోంది. మొత్తంగా రాష్ట్రంలో 2009, 2014 తరహా ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. మరి గెలుపెవరిది.
కొత్త సమీకరణాలు:ఏపీలో ఈ సారి ఎన్నికల ఫలితాల పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికల ప్రారంభానికి ముందే రాజకీయం కీలక మలుపులు తిరుగుతోంది. జగన్ గెలుపే ప్రామాణికంగా సామాజిక సమీకరణాలతో అభ్యర్దులను ఖరారు చేస్తున్నారు. ఇటు టీడీపీ, జనసేన పొత్తుతో వెళ్లటం ద్వారా జగన్ పైన గెలుపు ఖాయమని నమ్ముతున్నాయి. బీజేపీ నిర్ణయం మరో వారంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పాత్ర ఏపీలో ఈ సారి కీలకంగా మారుతోంది. అయితే, ఈ ఎన్నికల్లో పొత్తులు..పోరాటం 2009,2014 ఎన్నికల నాటి పరిస్థితులను గుర్తు చేస్తున్నాయి. 2009లో నాడు వైఎస్సార్ కు వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పాటైంది. అందులో టీడీపీ, టీఆర్ఎస్, వామపక్షాలు ఉన్నాయి. ప్రజారాజ్యం విడిగా పోటీ చేసింది.

త్రిముఖ పోటీ తప్పదా:2009 ఎన్నికల్లో హోరా హోరీగా సాగిన త్రిముఖ పోటీలో కాంగ్రెస్ -157 సీట్లతో అధికారంలోకి వచ్చింది. మహా కూటమి 106 సీట్లు గెలిచింది. ప్రజారాజ్యం 18 సీట్లే గెలవగలిగింది. ఇతరులు 13 సీట్లలో విజయం సాధించారు. వైఎస్సార్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2014లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి కూటమిగా బరిలో నిలిచాయి. పవన్ మద్దతుగా నిలిచారు. ఎన్నికల్లో పోటీ చేయలేదు.ఆ ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేసిన జగన్ కు 67 సీట్లు రాగా, బీజేపీ-టీడీపీకి 102 స్థానాలు దక్కాయి. 4.95 లక్షల ఓట్ల తేడాతో వైసీపీ ప్రతిపక్షానికి పరిమితం అయింది. 2019 ఎన్నికల్లో పొత్తులు లేకుండా ఎవరికి వారు వేర్వేరుగా పోటీ చేసాయి. ఫలితంగా జగన్ 151 సీట్లతో విజయం సాధించారు. ఇప్పుడు 2023 ఎన్నికల ఫలితాలపై అంచనాలు మొదలయ్యాయి.
2024లో గెలుపెవరిది:ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసే పోటీ చేస్తున్నాయి. బీజీపీ కలుస్తుందనే అభిప్రాయం వినిపిస్తోంది. అటు కాంగ్రెస్, వామపక్షాలు కలిసి బరిలో దిగే అవకాశం ఉంది. జగన్ పొత్తులు లేవని..సింగిల్ గానే పోటీ చేస్తానని ప్రకటించారు. జగన్ పైన వ్యతిరేకత పెరిగిందని..తమ రెండు పార్టీల విజయం ఖాయమని చంద్రబాబు, పవన్ ధీమాగా ఉన్నారు. అయితే, ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ లో ఎంట్రీ ద్వారా జగన్ కు నష్టం జరుగుతుందనేది ప్రత్యర్ధుల అంచనా. కానీ, షర్మిల ఎంట్రీతో జగన్ వ్యతిరేక ఓటు చీలుతుందనే వాదన తెర పైకి వచ్చింది. ఇదే సమయంలో ఏపీ ఫలితాలపై వరుసగా వెల్లడువతున్న పలు సంస్థల సర్వేలు సైతం వైసీపీకి మెజార్టీ సీట్లు వస్తాయని వెల్లడించాయి. ఇన్ని పార్టీలు కలిసి కూటమిగా జగన్ ను ఓడించేందుకు చేస్తున్న ప్రయత్నాలపైన ప్రజల్లో చర్చ సాగుతోంది. దీంతో..కూటమి విజయం సాధిస్తుందా.. సింగిల్ గా పోటీ చేస్తున్న జగన్ గెలుస్తారా అనే చర్చ రాజకీయంగా ఆసక్తి పెంచుతోంది.












Click it and Unblock the Notifications