ఏపీ రాజకీయాలను వేడెక్కిస్తోన్న "టిఫిన్ బండి"?
నెల్లూరు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. నెల్లూరు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఆనం వేణుగోపాలస్వామి దేవస్థానానికి చెందిన సిబ్బందిని స్టేషన్ కు ఎందుకు పిలిపించాల్సి వచ్చిందో వివరణ కావాలన్నారు. వారిపై ఏం విచారణ చేస్తారో నా ముందే చేయండంటూ సీఐకి తేల్చిచెప్పారు.

స్టేషన్ కు పరిగెత్తిన ఎస్పీ
ఎమ్మెల్యే కోపం చూసిన సీఐ వారిని వెంటనే వదిలిపెడతామని చెప్పినప్పటికీ ఆనం శాంతించలేదు. అన్యాయంగా వారిని తీసుకురావడమే కాకుండా స్టేషన్ లో గంటల తరబడి అలాగే ఉంచుతారా? వివరణ ఇవ్వాలంటూ పట్టుబట్టారు. ఆనం ఆగ్రహాన్ని చూసిన జిల్లా అధికార యంత్రాంగం వణికిపోయింది. ఏఎస్పీ హైమవతి స్వయంగా స్టేషన్ కు వచ్చి నచ్చచెప్పాలని చూశారు. అయినా రామనారాయణరెడ్డి కోపం చల్లారకపోవడంతో ఎస్పీ విజయరావు స్టేషన్ కు పరిగెత్తుకుంటూ వచ్చారు.

ఆక్రమణలు తొలగించడం తప్పా?
''వేణుగోపాలస్వామి దేవస్థానానికి చెందిన భూముల్లో గిరిజనులు కొందరు గుడిసెలు వేసుకుని టిఫిన్ బండి నడుపుకుంటున్నారు. అయితే వారు ఆక్రమణకు పాల్పడటంతో సిబ్బంది ఆ గుడిసెలను తొలగించారు.. ఇది తప్పా?'' అని ఆనం ప్రశ్నించారు. గుడిసెలు వేసుకున్న గిరిజనులు దేవస్థానం సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిని స్టేషన్ కు పిలిపించారు. తర్వాత మీడియాతో మాట్లాడిన ఆనం పోలీసులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థ ఇలా ఉండటం అత్యంత దారుణమని, దేవాలయ భూములను ఆక్రమించుకున్నవారికి వత్తాసు పలకడం ఏం న్యాయమన్నారు.

దేవస్థానాన్ని సంరక్షిస్తోన్న ఆనం కుటుంబం
ఆ భూముల్లో ఏర్పాటు చేసుకున్న టిఫిన్ బండి వివాదమే ఆనం కోపానికి కారణమైంది. రూరల్ పరిధిలోని సంఘటనపై ఆయన స్వయంగా రంగంలోకి దిగడానికి కారణం.. వేణుగోపాలస్వామి దేవస్థానం ఆలనా, పాలనా అన్నింటినీ మొదటి నుంచి ఆనం కుటుంబమే చూస్తోంది. అయితే రూరల్ పరిధిలో గిరిజనుల టిఫిన్ బండి తొలగించారంటే వారికి న్యాయం చేయడానికి కచ్చితంగా ఆ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే ప్రయత్నిస్తారని, దీనివల్లేఈ తతంగం జరిగిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. నెల్లూరు నగరంపై పట్టుకోసం ప్రయత్నిస్తున్న ఆనం ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ లోకి ప్రవేశించడంతో రాజకీయాలు కీలక మలుపు తిరుగబోతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications