శ్రీకాళహస్తిలో ఆనం కుమారుడి వీరంగం: ప్రత్యేక దర్శనం కోసం చిందులు
చిత్తూరు: తెలుగుదేశం నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తనయుడు శ్రీకాళహస్తిలో వీరంగం సృష్టించాడు. శివరాత్రి సందర్భంగా సోమవారం శ్రీకాళహస్తికి వెళ్లిన ఆనం శుభకర్ రెడ్డి తనకు ప్రత్యేక దర్శనం కల్పించాలంటూ అధికారులపై చిందులు వేశాడు.
దర్శనం కల్పిస్తారా? లేదా అంటూ ఈవో భ్రమరాంబపై ఒత్తిడి తీసుకు వచ్చాడు. అందుకు నిరాకరించిన ఈవోపై శుభకర్ రెడ్డి అంతు చూస్తానంటూ దుర్భాషలాడినట్టు సమాచారం.
'గతంలో ఎంతోమంది అధికారులను బదిలీ చేయించా. సీఎం చంద్రబాబునాయుడుతో మాట్లాడి నీ కథ తేలుస్తా' అంటూ ఈవో భ్రమరాంబపై శుభకర్ ఆగ్రహంతో ఊగిపోయినట్లు తెలిసింది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు శ్రీకాళహస్తిలో టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు దర్శనం వివాదాస్పదమవుతోంది. బాపిరాజుకు సోమవారం ప్రత్యేక దర్శనం కల్పించడంపై ఆలయ చైర్మన్, టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
మంత్రులు, ఎమ్మెల్యేలకే లేని సౌకర్యాన్ని బాపిరాజుకు ఎలా కల్పిస్తారంటూ ఆలయ అర్చకులపై తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. ఆగ్రహంతో భక్తుల ఎదుటే వారితో వాగ్వాదానికి దిగారు.
కోటప్పకొండను మరింత అభివృద్ధి చేస్తాం: కోడెల
గుంటూరు జిల్లాలోని కోటప్పకొండ క్షేత్రాన్ని దేశంలోనే ప్రముఖ పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండలో నిర్వహించే జాతర ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వచ్చే నాలుగేళ్లలో కోటప్పకొండను మరింత అభివృద్ధి చేస్తామన్నారు.