ఆంటోని తీసుకొచ్చే బాధ్యత చిరుపై: ఆనం, జగన్పై సెటైర్
హైదరాబాద్: ప్రస్తుత రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా ఆంటోని కమిటినీ రాష్ట్రానికి తీసుకు వచ్చేలా కృషి చేయాలని తాము కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలను కోరినట్లు ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మంగళవారం చెప్పారు. సీమాంధ్ర కాంగ్రెసు నాయకులు ఆనం నివాసంలో భేటీ అయ్యారు. అనంతరం మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ స్థాపించినప్పటి నుండి చాలా ఫైళ్ల పైన తొలి సంతకం పెడతానని చెప్పారని, ఇప్పుడు సమైక్య రాష్ట్రంపై మొదటి సంతకమని చెబుతున్నారని, ఆయన ఎన్నింటి పైన మొదటి సంతకాలు పెడతారోనని ఎద్దేవా చేశారు. రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడు సమైక్యాంధ్ర నినాదం ఎత్తుకున్నారని ధ్వజమెత్తారు.
విభజన అంశంలో కాంగ్రెసు పార్టీని దోషి చేయవద్దన్నారు. అన్ని పార్టీలు అంగీకరించాకనే కాంగ్రెసు తుది నిర్ణయం తీసుకుందన్నారు. తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ సమైక్యాంధ్ర అనడం లేదని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద విభజనకు అనుకూలంగా మాట్లాడి, అఖిల పక్షంలో నిర్ణయం తీసుకోమని చెప్పి ఇప్పుడు సమైక్యమంటోందన్నారు.
ఇరు ప్రాంతాల్లో ఉద్యమం జరుగుతున్నందున ఆంటోని కమిటీ రాష్ట్రానికి వచ్చి పరిస్థితులను పరిశీలించాలన్నారు. తాము ఇక నుండి సేవ్ ఆంధ్ర ప్రదేశ్, సేవ్ కాంగ్రెసు నినాదంతో ప్రజల్లోకి వెళ్తామన్నారు. సిడబ్ల్యూసి నిర్ణయం తర్వాత సీమాంధ్రలో ఆందోళనలు వచ్చాయన్నారు. సమ్మెలు, ఆందోళనలతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని పార్టీలు ఇచ్చిన మాటను తప్పాయన్నారు. కాంగ్రెసు పార్టీ కూడా మినహాయింపు కాదన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహా తమందరిదీ సమైక్యాంధ్ర నినాదమే అన్నారు. అయితే ప్రస్తుత రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా తక్షణం శాంతియుత వాతావరణం కావాలన్నారు. ముఖ్యమంత్రి అభిప్రాయాలతో తాము వ్యతిరేకించడం లేదన్నారు. కిరణ్ ఇప్పటికే సీమాంధ్ర పరిస్థితులను ఢిల్లీ దృష్టికి తీసుకు వెళ్లారన్నారు. రాష్ట్రంలో శాంతియుత వాతావరణం కావాలంటే ఇరు ప్రాంతాల మధ్య చర్చలు జరగాలన్నారు.