కెసిఆర్ సిఎం కలలు కల్లలే, టిలో జగన్ లేనే లేడు: ఆనం
హైదరాబాద్: ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కలలు నెరవేరవని, వచ్చే ఎన్నికలలో ఆయన పార్టీకి ఒక్క సీటు కూడా రాదని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాసన సభ్యులు ఆనం వివేకానంద రెడ్డి మంగళవారం ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రాంతంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఉనికే లేదని ఎద్దేవా చేశారు.
తాను గతంలో రాక్షసులు అన్నది కెసిఆర్ను ఉద్దేశించి మాత్రమే తప్ప తెలంగాణ ప్రజలను కాదన్నారు. తమకు తెలంగాణ ప్రజలు సోదరులు అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన రివ్యూ చేయడానికి కెసిఆర్ ఎవరన్నారు. తెలంగాణ ప్రాంతంలోను సైమైక్యవాదులు ఉన్నారని చెప్పారు. రెఫరెండం పెడితే రాష్ట్రంలో అరవై శాతం మంది సమైక్యవాదులు ఉన్నారన్నారు. కెసిఆర్ ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబును చూసి ఉద్యమం చేయడం నేర్చుకోవాలన్నారు.
విభజనపై సిడబ్ల్యూసి నిర్ణయం వచ్చిన నాలుగు రోజుల వరకు సీమాంధ్రలో ఉద్యమం లేదని, ఎప్పుడైతే కెసిఆర్ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారో అఫ్పుడు ప్రారంభమైందన్నారు. ఆయన తిట్టడం వల్ల సీమాంధ్రలో ప్రజలు ఆగ్రహావేశానికి లోనై రోడ్ల మీదకు వస్తున్నారన్నారు. ఆ పుణ్యం కెసిఆర్దేనని ఎద్దేవా చేశారు. రెచ్చగొట్టే మాటలు తనవి కాదని ఆయనవే అన్నారు. ముఖ్యమంత్రి కావాలని కలలు కుంటున్న కెసిఆర్కు ఒక్క సీటు రాదన్నారు.
సీమాంధ్ర ఉద్యమం క్రెడిట్ కెసిఆర్దే అన్నారు. తమలో ఆయన ఉద్యమ స్ఫూర్తి రగిలించారన్నారు. ఆయన నోటి దురుసు కారణంగానే ప్రజలు సమైక్య ఉద్యమంలో పాల్గొంటున్నారని చెప్పారు. శత్రువు అయనా సరే తాను ఆయనను పొగడుతున్నానన్నారు. మహాభారతంలో యుద్ధానికి శకుని కారణమైతే ఇప్పుడు కెసిఆర్ శకుని పాత్ర పోషిస్తున్నారని ధ్వజమెత్తారు. అప్పుడు శకుని మాటలు విని కౌరవులు నాశనమయ్యారన్నారు.
తమలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన కెసిఆర్కు ధన్యవాదాలు చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఉనికే లేదని అందుకే వైయస్ రాజశేఖర రెడ్డి సమాధి సాక్షిగా విభజనకు మద్దతు పలికిన జగన్ ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం సమైక్యం అంటున్నారని విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెసు ఉప ప్రాంతీయ పార్టీ అని చెప్పారు. జగన్ వంటి నేత నీతివంతమైన పాలన అనడం, కెసిఆర్ సభ్యత, సంస్కారం గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. వారు అలా మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు.