ఆనందయ్య మందు: TDPకి షాక్ -సోమిరెడ్డిపై చీటింగ్ కేసు -వైసీపీ నకిలీ వ్యాపారమన్న అచ్చెన్నాయుడు
కరోనాకు ఉపశమనంగా భావిస్తోన్న కృష్ణపట్నం ఆనందయ్య మందుపై రాజకీయాలు తారా స్థాయికి చేరాయి. ఆన్ లైన్ లో ఆనందయ్య మందు పంపిణీకి సంబంధించిన వివాదంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై నెల్లూరు జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఆనందయ్య, వైసీపీ నేతల వెర్షన్ ఒకలా, టీడీపీ నేతల వాదన మరోలా ఉంది. వివరాలివి..
Krishnapatnam medicine: కొద్దిగంటల్లో ఆనందయ్య మందు పంపిణీ షురూ -దాని పేరు 'ఔషధ చక్రం'
HIV మహిళకు Covid: 216 రోజుల్లో వైరస్ 32 సార్లు మ్యూటేషన్ - భారత్లో బీభత్సమే: షాకింగ్ రీసెర్చ్
సోమిరెడ్డిపై చీటింగ్ కేసు
ఆనందయ్య మందుతో వ్యాపారం చేసేందుకు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ప్లాన్ వేశారని, శేశ్రిత ఐటీ కంపెనీతో కలిసి వెబ్ సైట్ కూడా డిజైన్ చేశారని, సీఎం జగన్, మంత్రి గౌతమ్రెడ్డి, ఎమ్మెల్యే గోవర్ధన్ ఫొటోలు, వైసీపీ రంగులతో సదరు వెబ్ సైట్ జూన్ 2న లాంచ్ అయిందంటూ టీడీపీ నేత సోమిరెడ్డి మొన్న శనివారం తీవ్రఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి శేశ్రిత టెక్నాలజీ ఎండీ నందకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కృష్ణపట్నం పోలీసులు సోమిరెడ్డిపై చీటింగ్, ఫోర్జరీ, దొంగతనం ఆరోపణలు సహా ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. తమ అనుమతి లేకుండా డేటా చోరీ చేశారని, మోసపూరిత కుట్ర చేస్తున్నారని శ్రేశిత టెక్నాలజీస్ సంస్థ ప్రతినిధులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
అది ఫేక్ వెబ్ సైట్?
ఆనందయ్య మందును ఆన్ లైన్ ద్వారా అమ్మడానికి ఎమ్మెల్యే గోదర్శన్, శేశ్రిత కంపెనీ కలిసి.. మందుకు రూ.15 ధర నిర్ణయించి, కొరియర్ ఖర్చులు, జీఎస్టీ కలిపి రూ.167లకు విక్రయించేందుకు సిద్ధపడ్డారని, వీటిని చూసిన ఆనందయ్య కుటుంబం ప్రశ్నించడంతో వెబ్సైట్ను తొలగించారని, దీన్ని సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేయాలని, వెబ్సైట్ వెనుక ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. కానీ సదరు వెబ్ సైట్ ఫేక్ అని వెల్లడికావడం, దాన్ని కొద్దిరోజుల కిందటే తొలగించడం తెలిసిందే. సోమిరెడ్డి ఆరోపణలపై ఎమ్మెల్యే గోవర్ధన్ తోపాటు ఆనందయ్య కూడా మండిపడ్డారు.
టీడీపీపై వైసీపీ, ఆనందయ్య ఫైర్
కరోనాకు తాను తయారు చేసిన మందుపై కొందరు లేనిపోని విమర్శలు చేస్తున్నారని, అది సరికాదని ఆనందయ్య అన్నారు. ఒక వెబ్ సైట్ ను ప్రస్తావిస్తూ టీడీపీ నేత సోమిరెడ్డి విమర్శలు చేస్తున్నారని, తన మందుపై రాజకీయాలు తగవని, ప్రజలకు ఉపయోగపడే సలహాలు, సూచనలు ఇస్తే మంచిదని ఆనందయ్య పేర్కొన్నారు. సోమిరెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే కాకాని సైతం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శేశ్రిత టెక్నాలజీ ఎవరిదో కూడా తెలియదని, టీడీపీ ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, సోమిరెడ్డి తన దగ్గరున్న ఆధారాలను బయటపెట్టాలని కాకాని సవాలు చేశారు. ఆనందయ్యకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవడంతో జీర్ణించుకోలేకే టీడీపీ నేతలు దిగజారుడు కామెంట్లు చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. కాగా,
ఆనందయ్య మందుతో వైసీపీ వ్యాపారం..
తమ అనుమతి లేకుండా డేటా చోరీ చేశారని, మోసపూరిత కుట్ర చేస్తున్నారని శ్రేశిత టెక్నాలజీస్ సంస్థ ఇచ్చిన ఫిర్యాదుతో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై చీటింగ్ కేసు నమోదు చేయడాన్ని ఏపీ టీడీపీ తీవ్రంగా ఖండించింది. ఏపీ టీడీపీ చీఫ్ కింజరాపు అచ్చెన్నాయుడు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ జగన్ సర్కార్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనందయ్య తయారు చేసిన కరోనా మందుతోనూ వైసీపీ నకిలీ వ్యాపారం చేస్తోందని, బ్లాక్ మెయిల్ చేసిన వారిని వదిలి ప్రజల తరపున ప్రశ్నించిన సోమిరెడ్డిపై కేసు నమోదు చేశారని ఆరోపించారు.
ఆనందయ్యను బ్లాక్ మెయిల్ చేసిందెవరు?
''అవినీతి పరుల్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా వైసీపీ పాలన సాగుతోంది. ఆనందయ్య మందుపై వైసీపీ నేతల దొంగ వ్యాపారానికి కుట్ర చేశారు. యధేచ్ఛగా చట్టాలను ఉల్లంఘిస్తున్నారు. కుట్రను బయటపెట్టిన వ్యక్తిపై చీటింగ్, ఫోర్జరీ, దొంగతనం కేసులు పెడతారా? అసలు ఆనందయ్యను బెదిరించిన వాళ్లని, బ్లాక్ మెయిల్ చేసిన వారిని వదిలేస్తారా? ఈ అరాచకాన్ని ప్రశ్నిస్తే.. ప్రజాస్వామ్య హక్కుల్ని హరించేస్తారా? ఆనందయ్య ఉచితంగా ఇస్తోన్న మందును ఒక ప్యాకెట్ కు రూ.167కు అమ్మేందుకు శేశ్రిత టెక్నాలజీస్ సంస్థ ప్రయత్నించడం వాస్తవం కాదా? ఆనందయ్య అనుమతి లేకుండా మందు అమ్ముకునేందుకు ప్రయత్నించిన వారిపై చర్యలేవీ? సోమిరెడ్డిపై నమోదు చేసిన కేసుల్ని వెంటనే ఎత్తేయాలి. మందు దొంగచాటుగా అమ్మేందుకు యత్నించిన వారిపై కేస నమోదు చేయాలి'' అని అచ్చెన్నాయుడు జగన్ సర్కారుపై మండిపడ్డారు.