సర్వేపల్లిలో ఆనందయ్య మందు పంపిణీ- అవినీతి చేస్తే తన కుటుంబం నాశనమన్న కాకాణి
నెల్లూరు ఆనందయ్య కరోనా ఆయుర్వేద మందు పంపిణీ కార్యక్రమం ఇవాళ ఉదయం ప్రారంభమైంది. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలోని గొలగమూడి ఆలయం వద్ద ఈ కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. నియోజకవర్గంలోని 1.8 లక్షల కుటుంబాలకు ఆనందయ్య మందును పంపిణీ చేయనున్నట్లు స్ధానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి ప్రకటించారు.
నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ కార్యక్రమాన్ని స్ధానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. స్ధానిక గొలగమూడి ఆలయం వద్ద ఈ కార్యక్రమం జరుగుతోంది. సర్వేపల్లి నియోజకవర్గం పరిధిలోకి వచ్చే 1.8 లక్షల కుటుంబాలకు చెందిన 3 లక్షల మందికి ఈ మందును తొలి విడతలో పంపిణీ చేస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో దీనికి భారీ స్పందన లభిస్తోంది. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఆలయానికి వచ్చి ఆనందయ్య మందు తీసుకుని వెళ్తున్నారు.
కరోనా కష్టకాలంలో ఆనందయ్య మందు తయారు చేయడం సంతోషకరమైన విషయమని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే ముందుగా సర్వేపల్లికి మందు ఇవ్వాలని అనుకున్నట్లు ఆయన వెల్లడించారు. అందుకే ఒకటిన్నర లక్షల ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మందు ప్యాకెట్ను ప్రతీ కుటుంబానికీ ఇస్తామన్నారు. వాలంటీర్ల ఆధ్వర్యంలో అన్ని కుటుంబాలకు మందు చేరుస్తామన్నారు.
సర్వేపల్లిలో ఆనందయ్య మందు పంపిణీ- అవినీతి చేస్తే తన కుటుంబం నాశనమన్న కాకాణి#Andhrapradesh #Nellore #Sarvepalli pic.twitter.com/fzCAteJDnK
— oneindiatelugu (@oneindiatelugu) June 7, 2021
ఈ మందు పంపిణీని కూడా విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని కాకాణి ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవాలని సూచించారు. ఆనందయ్యమందు పంపిణీలో తాను అవినీతికి పాల్పడి ఉంటే తన కుటుంబం నాశనం అవుతుందని కాకాణి తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గంలో మందు పంపిణీ పూర్తి అయ్యాక రాష్ట్రవ్యాప్తంగా పంపుతామన్నారు.