ఆనందయ్య మందుపై రేపే ఫైనల్ రిపోర్ట్-ఏం తేల్చనున్నారు-అంతిమ నిర్ణయం ఎప్పుడంటే...
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య కరోనా మందుపై రాష్ట్ర ప్రభుత్వం సోమవారం(మే 31) అంతిమ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాష్ట్ర ఆయుష్ కమిషనర్ రాములు వెల్లడించారు. ఇప్పటికే మందులోని కెమికల్ కాంపోజిషన్స్కి సంబంధించిన రిపోర్టులు వస్తున్నాయని... చివరి రిపోర్టు శనివారం(మే 29) వచ్చే అవకాశం ఉందని తెలిపారు. మందుపై ఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్ (సీసీఆర్ఏఎస్) అధ్యయనం కూడా పూర్తయిందని.. ఆ నివేదిక కూడా రేపే వస్తుందని చెప్పారు.

రేపే ఫైనల్ రిపోర్ట్
డ్రగ్ లైసెన్స్ ప్రక్రియలో భాగంగా నిపుణుల కమిటీ ఈ నివేదికలన్నింటినీ అధ్యయనం చేసి శనివారం రిపోర్ట్ తయారుచేస్తుందని చెప్పారు. మందు సురక్షితమా కాదా అన్నది ఆ రిపోర్టులో వెల్లడిస్తారని తెలిపారు. మందుపై హైకోర్టు తీర్పు సోమవారం(మే 31) వచ్చే అవకాశం ఉందన్నారు. కాబట్టి వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అంతిమ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. మందు విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని... ప్రజల మనోభావాలను,ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఆనందయ్య ఇస్తున్న కంటి మందును ఇతర వైద్య విధానాల ద్వారా కూడా అధ్యయనం చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.

ఇంటికి చేరిన ఆనందయ్య
సీసీఆర్ఏఎస్ ఆధ్వర్యంలో తిరుపతి ఎస్వీ ఆయుర్వేద కాలేజీలో జరగాల్సిన క్లినికల్ ట్రయల్స్ ఇంకా ప్రారంభం కాలేదన్నారు. అటు మందు తయారుచేసిన వ్యక్తికి,ఇటు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదన్న ఉద్దేశంతోనే.. కొంత కాలయాపన జరిగినా సమగ్ర అధ్యయనం తర్వాతే ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.ఇక గత కొద్దిరోజులుగా పోలీసుల భద్రత నడుమ రహస్య ప్రాంతంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.శుక్రవారం(మే 28) మధ్యాహ్నం ఎట్టకేలకు ఆయన తన నివాసానికి చేరుకున్నారు. దీంతో గ్రామస్తులు ఆయన నివాసం వద్దకు తరలివచ్చారు. ఆనందయ్యను మళ్లీ ఎక్కడికి తరలించవద్దని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. కృష్ణపట్నంలో 144 సెక్షన్ కొనసాగుతోంది. బయటి వ్యక్తులను పోలీసులు గ్రామంలోకి అనుమతించట్లేదు.
Recommended Video

తుది నివేదికలో ఏముందో...
ఆనందయ్య మందుపై ఆయుష్ బృందంతో పాటు ఐసీఎంఆర్,సీసీఆర్ఏఎస్ బృందాలు అధ్యయనం చేసిన సంగతి తెలిసిందే. ఆయుష్ కమిషనర్ రాములు దీన్ని నాటు మందుగా గుర్తిస్తున్నామని గతంలో పేర్కొన్నారు. ఆయుర్వేద ప్రోటోకాల్స్ పాటించనందునా నాటు మందుగా గుర్తిస్తున్నామని చెప్పారు. ఈ మందులో ఎటువంటి హానికారక పదార్థాలు లేవని... ఇప్పటివరకూ మందు తీసుకున్నవారిలోనూ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ బయటపడలేదని చెప్పారు. ఇక రేపు రానున్న తుది నివేదికలో ఆనందయ్య మందుపై ఏం తేలనుందన్నది సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. మందుకు అన్ని అడ్డంకులు తొలగిపోయి త్వరగా పంపిణీ చేయాలని చాలామంది ప్రజలు కోరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications