జేసీ దివాకర్ రెడ్డి కులగజ్జి వ్యాఖ్యలపై 'అనంత' మేయర్ గట్టి కౌంటర్
అమరావతి: అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కులగజ్జి వ్యాఖ్యలపై నగర మేయర్ స్వరూప ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కులగజ్జి మాకు లేదంటూ ఎంపీ దివాకర్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు.
వారికి కులగజ్జి: జేసీ దివాకర్ రెడ్డి ఆగ్రహం, 'ఏపీలో విధ్వంసానికి జగన్ కుట్ర' గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే నుంచి మంత్రి వరకు, కలెక్టర్ నుంచి కమిషనర్ దాకా ఒకే సామాజిక వర్గం వారిని నియమించుకున్నారని ఆమె ఈ సందర్ఫంగా గుర్తు చేశారు. అనంతపురం కార్పొరేషన్లో అవినీతిపై మాట్లాడే అర్హత దివాకర్రెడ్డికి లేదన్నారు.
ఎంపీ దివాకర్ రెడ్డిపై పార్టీ క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తానని స్వరూప తెలిపారు. కాగా అనంతపురంలో విష జ్వరాలు విజృంభించిన నేపథ్యంలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడిన సంగతి తెలిసిందే. ప్రజాసమస్యలను పరిష్కరించడంలో టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి పూర్తిగా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేతో పాటు నగర మేయర్, కమిషనర్కు కులగజ్జి పట్టుకుందంటూ సొంత పార్టీ నేతలపైనే జేసీ తీవ్రంగా మండిపడ్డారు. వారి కులగజ్జి కారణంగానే అనంతపురంలో పారిశుద్ధ్యం పడకేసిందని అన్నారు. మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతిపై చంద్రబాబు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తాను నగరంలో అభివృద్ధి పనులు ప్రారంభిస్తే వాటిని కూడా వారు అడ్డుకున్నారని జేసీ మండిపడ్డారు. అయితే టీడీపీ ఎంపీగా ఉంటూ చంద్రబాబు సామాజికవర్గానికే చెందిన ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మేయర్ మదమంచి స్వరూపపై జేసీ నేరుగా విరుచుకుపడడం చర్చనీయాంశమైంది.