వారికి కులగజ్జి: జేసీ దివాకర్ రెడ్డి ఆగ్రహం, 'ఏపీలో విధ్వంసానికి జగన్ కుట్ర'
అనంతపురం: తెలుగుదేశం పార్టీ నేత, అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డికి కోపం వచ్చింది. ఎమ్మెల్యే, మేయర్, కమిషనర్లకు కులగజ్జి పట్టుకుందని ఆయన ఆదివారం నాడు తీవ్రంగా మండిపడ్డారు. అనంతపురంలో పారిశుద్ధ్యం పడకేసినా పట్టించుకోవడం లేదన్నారు.
అనంతపురం నగరంలో ప్రబలిన విష జ్వరలను, ప్రజా సమస్యలను స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి పట్టించుకోవడంలో విఫలమయ్యారన్నారు. తాను అభివృద్ధి చర్యలు ప్రారంభిస్తే, దానికి కూడా వారు అడ్డు పడుతున్నారని జేసీ దివాకర్ రెడ్డి మండిపడ్డారు.
ఏపీలో విధ్వంసం సృష్టించేందుకు జగన్ ప్రయత్నం: కళా వెంకట్రావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించేందుకు ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని ఏపీ టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావు అన్నారు. ప్యాకేజీ, ప్రత్యేక హోదా పైన ప్రతిపక్ష నేతకు అవగాహన లేదన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఏపీ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. మత్స్యకారుల అభివృద్ధికి టిడిపి కృషి చేస్తోందన్నారు.