అనంత రాజకీయాల్లో అనూహ్యం : జేసీ- పరిటాల కలిసి పోయారా : ఆలింగనాలు-రెండు వర్గాల్లో షేకింగ్..!!
అనంతపురం రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ఉప్పు నిప్పుగా ఉన్న జేసీ - పరిటాల వర్గాల మధ్య ఆసక్తి కర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఈ తాజా పరిణామాలు జిల్లాలోనే కాదు..రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అనంతపురం జిల్లా రాజకీయాల్లో చాలా కాలం నుంచి పరిటాల కుటుంబం, జేసీ కుటుంబం బద్ధ శత్రువులుగా ఉన్నాయి. పరిటాల రవి ఉన్న సమయం నుంచీ ఒకరి కుటుంబంతో మరొకరికి సయోధ్య లేదు.
గతం కంటే భిన్నంగా అనంత నేతలు
అప్పట్లో జేసీ వర్గం కాంగ్రెస్ లో.. పరిటాల టీడీపీలో ఉండేవారు. కాంగ్రెస్ అధికారంలో వస్తే జేసీ ఖచ్చితంగా మంత్రి అయి తన హవా నిరూపించుకొనే వారు. అదే విధంగా టీడీపీకి జిల్లాలో పరిటాల కీలక నేతగా ఎదిగారు. ఆయన సైతం మంత్రిగా పని చేసారు. అయితే, 2014 రాష్ట్ర విభజన తరువాత జేసీ బ్రదర్స్ సైతం టీడీపీలో చేరారు. అయినా..పార్టీ పరంగానూ ఇద్దరూ కలిసిన సందర్భాలు లేవు. ఈ రోజున టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అనంతపురం వచ్చారు. ఆయనకు స్వాగతం పలికేందుకు జె సీ ప్రభాకర్ రెడ్డి తోపాటు పరిటాల శ్రీరామ్ ఇతర నేతలు అక్కడకు చేరుకున్నారు.
ప్రభాకర రెడ్డి ..శ్రీరాం ఆలింగనాలు
శ్రీరామ్ అక్కడకు రాగానే అనుచరులు తమ నేతకు అనుకూలంగా జేసీ సమక్షంలోనే పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. శ్రీరామ్ కారు దిగి నేరుగా ప్రభాకర్ రెడ్డి వద్దకు వెళ్లారు. ఇద్దరు ఆలింగనం చేసుకున్నారు. దీంతో..ఇద్దరి నేతలు వెనుక ఉన్న అనుచరులు షాక్ కు గురయ్యారు. కొంత మంది చప్పట్లు కొట్టి ఈ పరిణామాన్ని స్వాగతించారు. ఆ తర్వాత ఇద్దరూ మాటలు కలిపారు. జేసీ ప్రభాకర్రెడ్డి, శ్రీరామ్ నవ్వుతూ పలకరించుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది. వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ప్రభాకర రెడ్డి విమర్శించారు.
లోకేశ్ పర్యటన ముందు ఆసక్తి కరంగా
రాత్రి సమయంలో అన్నం తింటుండగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఈ సమస్య టీడీపీది కాదని.. రాష్ట్ర ప్రజలది అన్నారు. రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసిందని.. ఇప్పటికైనా ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయకపోతే ఏమీ మిగలదంటూ వ్యాఖ్యానించారు. లోకేశ్ అక్కడకు చేరుకోగానే ఇద్దరు నేతలతో పాటుగా మిగిలిన నేతలు స్వాగతం పలితాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా తాడిపత్రిలో మాత్రమే టీడీపీ గెలిచింది. అక్కడ జేసీ ప్రభాకర రెడ్డి ఛైర్మన్ అయ్యారు.
సయోధ్య కుదిరినట్లేనా
ఇక, 2019 ఎన్నికల్లో రాప్తాడు నుంచి పోటీ చేసిన పరిటాల శ్రీరామ్.. తాడిపత్రి నుంచి పోటీ చేసిన జేసీ ప్రభాకర రెడ్డి ఇద్దరూ ఓడిపోయారు. ఇప్పుడు జిల్లాలో జేసీ వర్సెస్ టీడీపీ నేతలు అన్నట్లుగా మారుతున్న పరిస్థితుల్లో.. జేసీ - శ్రీరాం అపూర్వ కలయిక ఆ నిమిషం వరకేనా.. లేక, భవిష్యత్ లోనూ కొనసాగుతుందా అనే చర్చ మొదలైంది. అయితే, టీడీపీ శ్రేణులు మాత్రం ఇలా ఇద్దరు కలవటం పై హ్యాపీగా ఉన్నారు. కానీ, ఇది తాత్కాలికమేననే అభిప్రాయం జిల్లా పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.