పరాయి పురుషులతో మాట్లాడనని హామీపత్రం ఇవ్వు.. ఓ భర్త విచిత్ర డిమాండ్.. కత్తితో ఆమెపై దాడి
అనంతపురం జిల్లా గుంతకల్లులో దారుణం జరిగింది. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త... పరాయి పురుషులతో మాట్లాడనని హామీ పత్రం రాసివ్వాలన్నాడు. దీనిపై ఇద్దరి మధ్య గొడవ జరగడంతో కత్తితో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన ఆమె ప్రస్తుతం చావు బతుకుల నడుమ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
వివరాల్లోకి వెళ్తే... గుంతకల్లుకు చెందిన రజాక్ అనే వ్యక్తికి అనంతపురం పట్టణానికి చెందిన షర్మిలతో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు కుమారుడు,కుమార్తె ఉన్నారు. దంపతులిద్దరు స్థానికంగా కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కొన్నాళ్లుగా రజాక్ భార్య షర్మిలపై అనుమానం పెంచుకున్నాడు. ఆమె పరాయి పురుషులతో మాట్లాడటం సహించలేకపోతున్నాడు. తరుచూ ఆమెతో గొడవపడుతున్నాడు. ఓరోజు తీవ్రంగా కొట్టడంతో ఆమె పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.
మూడు రోజుల క్రితం భార్యతో మళ్లీ గొడవపడ్డాడు.పరాయి పురుషులతో మాట్లాడనని లిఖితపూర్వకంగా హామీ పత్రం ఇవ్వమన్నాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. హామీపత్రం రాసిచ్చేందుకు షర్మిల నిరాకరించింది. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన రజాక్ కత్తితో ఆమెపై దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన షర్మిలను స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరో ఘటనలో గుంటూరులో ఓ యువకుడు వివాహిత గొంతు కోసి హత్యకు యత్నించాడు. ఆపై తానూ గొంతు కోసుకున్నాడు. తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ మరొకరితోనూ సంబంధం పెట్టుకుందని అనుమానం పెంచుకున్న సాగర్ బాబు అనే యువకుడు ఆమెపై దాడికి పాల్పడుతున్నాడు. మాట్లాడుదాం రమ్మని చెప్పిన గుంటూరు బ్రాడీపేటలోని ఓ హోటల్ గదికి ఆమెను పిలిపించాడు.
ఎన్నిసార్లు చెప్పినా ప్రవర్తన మార్చుకోవట్లేదని ఆమెను హెచ్చరించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. దీంతో క్షణికావేశంలో సాగర్ కత్తితో ఆమె గొంతు కోశాడు. ఆపై తాను కూడా గొంతు కోసుకున్నాడు. మహిళ కేకలతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. ఇద్దరినీ ఆస్పత్రిలో చేర్చగా ప్రస్తుతం వారికి ప్రాణపాయమేమీ లేదని పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.