చంద్రబాబుకు షాకిచ్చిన జేసీ దివాకర్ రెడ్డి: ఇలాగైతే పార్టీ అంతే!
పార్టీలో చోటుచేసుకొన్న పరిణామాలపై అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా టిడిపి అధినేత చంద్రబాబుకు చెప్పారు. పద్దతిని మార్చుకోకపోతే నష్టమేనని హెచ్చరించారు.
అమరావతి: పార్టీలో చోటుచేసుకొన్న పరిణామాలపై అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా టిడిపి అధినేత చంద్రబాబుకు చెప్పారు. పద్దతిని మార్చుకోకపోతే నష్టమేనని హెచ్చరించారు. అధికారంలో ఉన్న వారికి నిజాలు చేదుగా కన్పిస్తాయన్నారు. కళ్ళ ముందు జరిగే వాటిని కూడ చూడలేరని జెసీ దివాకర్ రెడ్డి కుండబద్దలుకొట్టారు.
కొంతకాలంగా పార్టీలో, ప్రభుత్వంలో చోటుచేసుకొన్న పరిణామాలపై బాబుతో తన అభిప్రాయాలను అనంతపురం ఎంపీ జెసీ దివాకర్ రెడ్డి చర్చించారు. నాలుగురోజుల క్రితం అమరావతిలో బాబుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
మనసులో ఉన్న విషయాలను నిర్మోహమాటంగా బయటకు చెప్పే వ్యక్తిగా దివాకర్ రెడ్డికి పేరుంది. ఏ విషయాన్ని ఆయన దాచుకోడు. తాను చెప్పాలనుకొన్న విషయాలను ఆయన చెప్పేస్తాడు.
2014 ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి టిడిపిలో చేరారు. టిడిపిలో చేరిన తర్వాత కూడ ఆయన కాంగ్రెస్ పార్టీలో మాట్లాడినట్టుగానే తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
పద్దతిని మార్చుకోవాలని బాబుకు జేసీ సూచన
నాలుగురోజుల క్రితం టిడిపి అధినేత చంద్రబాబునాయుడుతో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అమరావతిలో సమావేశమయ్యారు. ఉదయంపూట తొమ్మిదిగంటలకు అధికారుల అపాయింట్ మెంట్ అయ్యాక దివాకర్ రెడ్డికి టైమిచ్చారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలను చంద్రబాబుకు పూసగుచ్చినట్టు వివరించారు.పార్టీలో ఏం జరుగుతోందో కూడ బాబుకు దివాకర్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను చేపడుతున్నా ఆశించినంత స్పందన కన్పించడం లేదన్నారు. పార్టీలో ఏం జరుగుతోందో కూడ జేసీ చెప్పారు. అయితే పద్దతిని మార్చుకోవాలని బాబుకు ఆయన సూచించారు.
మంచి పనులు చేసినా ప్రభుత్వానికి మంచిపేరు రావడం లేదు
రాష్ట్ర ప్రభుత్వం అనేక మంచిపనులు చేసినా ప్రభుత్వానికి మంచిపేరు రావడం లేదని జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని భూములకు విపరీతమైన ధరలు పెరిగాయన్నారు.ప్రజలు ఎంతో లాభపడ్డారని జేసీ చెప్పారు. ప్రభుత్వం వల్ల లబ్దిపొందిన వాళ్ళే ప్రభుత్వాన్ని తిడుతున్నారని చెప్పారు. పుట్టిన బిడ్డకు కట్ ఇవ్వడం నుండి తల్లిబిడ్డలను క్షేమంగా ఇంటికి పంపించడానికి తల్లిబిడ్డల ఎక్స్ ప్రెస్ ను ఏర్పాటుచేసింది ప్రభుత్వం. చనిపోయిన వ్యక్తిని మహాప్రస్థానం పేరిట అంబులెన్స్ లో ఇంటికి పంపే ఏర్పాటు చేసింది. ఇలాంటి మంచి పనులను చేపడుతున్న ప్రభుత్వానికి రావాల్సిందంతా మైలేజీ రావడం లేదని జేసీ అభిప్రాయపడ్డారు.
ఇష్టానుసారంగా వ్యవహరించే వారిపై క్రమశిక్షణ చర్యలు
పార్టీలో చోటుచేసుకొంటున్న పరిణామాలపై కూడ ఆయన తీవ్రంగా స్పందించారు. పార్టీలో క్రమశిక్షణరాహిత్యాన్ని సహించకూడదని చెప్పారు. తప్పుచేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన పార్టీ అధినేత చంద్రబాబునాయుడును కోరారు. అయితే తప్పుచేసినవారిపై పార్టీ చర్యలు తీసుకొనే విషయమై అందరికీ తెలిసేలా వాటిని అమలు చేయాలని ఆయన కోరారు. రానున్న ఎన్నికల కోసం అందరు సిద్దం కావాలని ఆయన కోరారు. సమీక్షలు, సమావేశాలు ఆపేసి ఇక ఎన్నికల మేనేజ్ మెంట్ పై దృష్టిని కేంద్రీకరిస్తే 2019 ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి వస్తామన్నారు.
జేసీ దివాకర్ రెడ్డితో ఏకీభవించిన బాబు
జేసీ దివాకర్ రెడ్డి చెప్పిన అంశాలతో చంద్రబాబునాయుడు ఏకీభవించారు. పెన్షన్లు, బియ్యం, గృహాలు, నిరంతర విద్యుత్ సరఫరా, రుణమాఫీ, సంక్రాంతి, క్రిస్మస్ కానుకల వంటి కార్యక్రమాలను చేపట్టినా ప్రజల్లో అంతగా తృప్తిలేదన్నారు బాబు. ఈ విషయమై సాయంత్రం మూడు గంటలపాటు పార్టీ కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నట్టు ముఖ్యమంత్రి జేసీ దివాకర్ రెడ్డికి వివరించారు. కానీ, ఏ రోజు కూడ ఫాలో అవ్వడం లేదని దివాకర్ రెడ్డి గుర్తుచేశారు. చేసిన కార్యక్రమాలు చెప్పుకోవడం...ప్రజల మనస్సులోకి వెళ్ళేలా ప్రచారం చేసుకోవడం తద్వారా లబ్దిపొందేవిధంగా చూసుకోవడం తద్వారా లబ్దిపొందే విధంగా చూసుకోవడం ఇంపార్టెంటన్నారు జేసీ.జగన్ బలహీనంగా ఉండడం...పదే పదే సెల్ప్ గోల్ప్ వేసుకోవడంతో టిడిపి ప్రభుత్వానికి ఇబ్బందులు లేకుండా ఉన్నాయని జేసీ అన్నారు.