ఏపీ బంద్ ఎఫెక్ట్: నిలిచిన బస్సులు, మూతబడ్డ షాపింగ్ కాంప్లెక్స్లు, హౌస్ అరెస్ట్
అమరావతి: ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ వైసీపీ, వామపక్షాల ఆధ్వర్యంలో శనివారం తలపెట్టిన ఏపీ బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. బంద్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్తక, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. పలువురు వైసీపీ, వామపక్ష నేతలను పోలీసులు ముందుస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
బంద్ నేపథ్యంలో శనివారం తెల్లవారుజాము నుంచే ఆర్టీసీ డిపోల ఎదుట వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున ధర్నాలు చేపట్టడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మరోవైపు జాతీయ రహదారుల దిగ్భంధనానికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఆర్టీసీ డిపో, బస్టాండ్ల దగ్గర నిరసనకు దిగడంతో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి.
దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. కర్నూలు, విశాఖ, ప్రకాశం, నెల్లూరు, కడప, తిరుపతి, ఉభయగోదావరి జిల్లాలు, శ్రీకాకుళం,అనంతపురం జిల్లాల్లో వైసీపీ, వామపక్ష కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వైసీపీ నేతలంతా జై జగన్ అంటూ నినాదాలు హోరెత్తిస్తున్నారు. హోదా సాధించే వరకు వైసీపీ పోరాటం చేస్తుందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

విజయవాడలో బంద్ ప్రభావం
శనివారం వైసీపీ తలపెట్టిన బంద్ విజయవాడతో పాటు కృష్ణాజిల్లాలో సంపూర్ణంగా జరుగుతోంది. ఏపీ బంద్ సందర్భంగా వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. విజయవాడకు చెందిన పలువురు వైసీపీ, వామసక్ష నేతలను పోలీసులు ముందుగానే అరెస్ట్ చేశారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ దగ్గర వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేయటంతో భారీగా పోలీసుల మోహరించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలియజేస్తున్నారు.
తిరుపతిలో వైసీపీ, వామపక్ష నేతలు అరెస్టు
వైసీపీ, వామపక్షాలు చేపట్టిన బంద్ చిత్తూరు జిల్లాలో పాక్షికంగా సాగుతోంది. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే నేతలను అరెస్టు చేసి పోలీస్స్టేషన్లకు తరలించారు. జిల్లా వ్యాప్తంగా వైసీపీ, వామపక్ష పార్టీలకు చెందిన 54 మందిని అదుపులోకి తీసుకున్నారు. తిరుపతిలో వైకాపా నేత భూమన కరుణాకర్రెడ్డిని అరెస్టు చేసి తిరుచానూరు పోలీస్స్టేషన్కు తరలించారు.
కడపలో కొనసాగుతున్న బంద్
జగన్ సొంత జిల్లా కడపలో ప్రశాతంగా సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 8 డిపోల పరిధిలో 930 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తెల్లవారుజామునే బస్టాండ్ల వద్దకు చేరుకుని ఆందోళనకు దిగిన వైసీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా వ్యాప్తంగా సీపీఐ, వైసీపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టు చేశారు.
మరోవైపు సీపీఎం నాయకులు శాంతియుతంగా మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. విద్యా, వ్యాపార, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా సినిమాహాళ్లు, పెట్రోల్ బంక్లు మూసివేశారు. మేయర్ సురేష్బాబుతోపాటు పలువురు వైసీపీ నేతలను అరెస్ట్ చేశారు. రాజంపేట ఆర్టీసీ డిపో ఎదుట వైసీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి, కార్యకర్తలు బైఠాయించి నిరసన తెలియజేశారు.
విశాఖపట్నంలో కొనసాగుతున్న బంద్
విశాఖపట్నంలోని మద్దిలపాలెం జంక్షన్లో వైసీపీ, వామపక్ష కార్యకర్తల ర్యాలీ నిర్వహించారు. సీపీఎం నగర కార్యదర్శి జగ్గు నాయుడితో సహా పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాలో బంద్ పాక్షికంగా కొనసాగుతోంది. వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నానిని హౌస్ అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications