ఏపీ ఆన్లైన్ కేబినెట్..ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్: మూడు నెలల కోసం: ఎన్ని వేల కోట్లో తెలుసా
అమరావతి: ఊహించినట్టే.. ఈ సారి రాష్ట్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. అసెంబ్లీని సమావేశ పరిచి.. వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలను సభలో ప్రవేశపెట్టే అవకాశం లేకపోవడంతో.. ఈ సారి ఓట్ ఆన్ అకౌంట్ విధానాన్ని అనుసరించింది. మూడు నెలల కాలానికి 90 వేల కోట్ల రూపాయల అంచనాలతో కూడిన బడ్జెట్ ప్రతిపాదనలను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ ప్రతిపాదనలను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం కోసం రాజ్భవన్కు పంపించింది. ఈ నెల 31వ తేదీలోగా గవర్నర్ ఈ ప్రతిపాదనలను ఆమోదించాల్సి ఉంటుంది.
జగన్ నోట తొలిసారిగా: కర్నూలే న్యాయ రాజధాని: ఓర్వకల్ ఎయిర్పోర్ట్కు ఉయ్యాలవాడ పేరు
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించడానికి రాష్ట్ర మంత్రివర్గం కొద్దిసేపటి కిందటే ఆన్లైన్ ద్వారా సమావేశమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఇదివరకే సిద్ధం చేసిన బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించారు. అనంతరం బడ్జెట్ ఆర్డినెన్సుకు ఆమోదం తెలిపారు. దీని విలువ 90,000 కోట్ల రూపాయలు. 2021-2022 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం కోసమే రూపకల్పన చేసిన బడ్జెట్ ఇది. జూన్ 31వ తేదీ వరకు మాత్రమే ఈ బడ్జెట్ వర్తిస్తుంది.
అనంతరం.. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా అసెంబ్లీ సమావేశమౌతుందా? లేదా? అనేది ప్రభుత్వం నిర్ధారిస్తుంది. ఈ ప్రతిపాదనలపై ఈ నెల 31వ తేదీ లోపు గవర్నర్ ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. ఉప ఎన్నిక షెడ్యూల్ అమల్లో ఉండటం.. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈ సారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. కాగా- జూన్ చివరి వారం నాటికి పూర్తిస్థాయి బడ్జెట్ను ఆమోదింంపజేసుకునే అవకాశాలు లేకపోలేదని సమాచారం.
వచ్చే ఎన్నికల్లో మన పార్టీదే విజయం..నేనే తెలంగాణ సీఎం: నేతలతో వైయస్ షర్మిల (ఫోటోలు)
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై వైఎస్ జగన్.. అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు, ఇతర అధికారులతో ఈ నెల 17వ తేదీన సమీక్ష నిర్వహించారు. సమావేశాలను వాయిదా వేస్తేనే మంచిదనే అభిప్రాయాన్ని వారు వెలిబుచ్చారు. దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు. మే 6వ తేదీ నుంచి విశాఖపట్నానికి రాజధానిని తరలించే ప్రక్రియను చేపట్టాల్సి ఉన్నందున.. అసెంబ్లీ భేటీని జూన్ వరకూ వాయిదా వేయాలనే అభిప్రాయం కూడా ఈ సమావేశంలో వ్యక్తం కాగా.. ఆ ప్రకారమే మూడునెలల కాలానికి బడ్జెట్ ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించింది.