హైద్రాబాద్ రెవెన్యూలో 40% వాటా ఆంధ్రాదే, అలా చేస్తే ఏపీయే టాప్: నీతి ఆయోగ్ వైస్ ఛైర్మెన్ రాజీవ్
అమరావతి: హైద్రాబాద్లో వసూలయ్యే మొత్తం పన్నుల్లో 40 శాతం ఆంధ్రావారు చెల్లించినవేనని, వారంతా ఏపీకి వస్తే నవ్యాంధ్రకు ఆర్థిక సమస్యలు ఉండవని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీ రాజధాని అమరావతిలో గురువారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ పాల్గొన్నారు. హైద్రాబాద్ను కోల్పోవడంతో ఏపీ రాష్ట్రం ఆదాయాన్ని కొంత మేరకు నష్టపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే ఏపీ రాష్ట్రానికి అన్ని రకాలుగా సహయం అందిస్తామని ఆయన హమీ ఇచ్చారు. కలెక్టర్ల సమావేశం తర్వాత మీడియాతో కూడ ఆయన మాట్లాడారు. అవినీతి రహిత భారత్ దిశగా తాము ముందుకు సాగుతామని ఆయన చెప్పారు.
40 శాతం ఆంద్రావారు చెల్లిస్తున్నవే
హైద్రాబాద్ లో వసూలయ్యే మొత్తం పన్నుల్లో 40 శాతం ఆంధ్రావారు చెల్లిస్తున్నవేనని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మెన్ రాజీవ్ కుమార్ అభిప్రాయపడ్డారు. హైద్రాబాద్నే ఏపీ రాష్ట్రం కోల్పోవడం కూడ ఆర్థికంగా కొంత నష్టమేనని ఆయన అభిప్రాయపడ్డారు.అయితే హైద్రాబాద్లో పన్నులు చెల్లిస్తున్నవారంతా ఏపీకి తరలివస్తే నవ్యాంధ్రకు ఇబ్బందులు ఉండవని ఆయన చెప్పారు.ఏపీనే ఇతర రాష్ట్రాలకు సహకరించే స్థాయికి ఎదుగుతుందని రాజీవ్ కుమార్ అభిప్రాయపడ్డారు.
క్లౌడ్ ఎకనమిక్ జోన్ ఏర్పాటుకు అభ్యంతరం లేదు
క్లౌడ్ ఎకనమిక్ జోన్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం నిరభ్యంతరంగా ముందుకు వెళ్లొచ్చని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ చెప్పారు.
దీనికి కేంద్రం అనుమతి అవసరం లేదన్నారాయన. 2022 నాటికి నూతన భారత్ను ఆవిష్కరించే లక్ష్యంతో నీతి ఆయోగ్ పనిచేస్తోందని తెలిపారు.నోట్ల రద్దు అనంతరం 56 లక్షల మంది కొత్తగా పన్ను కట్టే వారి జాబితాలోకి చేరారని, మూడు వందల షెల్ కంపెనీల గుట్టురట్టయిందని రాజీవ్ కుమార్ చెప్పారు.
కృష్ణపట్నం- తిరుపతి మధ్య సెజ్
దేశంలో రెండు సెజ్ లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ చెప్పారు. ఈ సెజ్ ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలని భావిస్తున్నామని ఆయన చెప్పారు. గుజరాత్ రాష్ట్రంలో మొదటి సెజ్ ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. రెండో సెజ్ ను కృష్ణపట్నం- తిరుపతి మధ్య సెజ్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నామన్నారు. ఈ సెజ్కు త్వరగా అనుమతులు వచ్చేలా సహకరిస్తామని అన్నారు.
విశాఖలో చదువుకొన్నాను
తనకు ఏపీతో అనుబంధం ఉందని, తాను విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో 1976లో చదువుకున్నానని రాజీవ్ కుమార్ చెప్పారు.పోలవరం ప్రాజెక్టును సందర్శించారు.ప్రాజెక్టు పనులను చురుగ్గా సాగుతున్నాయని, దేశంలో అత్యుత్తమ ప్రాజెక్టుగా పోలవరం నిలుస్తుందనడంలో సందేహం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని శరవేగంగా పూర్తి చేస్తోందని, నిర్దేశిత గడువులోగా ప్రాజెక్టు పూర్తవుతుందన్న నమ్మకం తనకు ఉందన్నారు.