కాకినాడ పోర్ట్లో అనూహ్యం: వైసీపీ అనుకూల అధికారులకు మంగళం: ఆ ముగ్గురూ అవుట్?
Kakinada Port: కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందులో ఎవరి ప్రమేయం ఉందో సమగ్రంగా ఆరా తీస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.
ఈ క్రమంలోనే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే నమోదైన కేసుల ఆధారంగా ఈ సిట్ దర్యాప్తు చేపట్టింది. సీబీసీఐడీ ఇన్స్పెక్టర్ జనరల్ వినీత్ బ్రిజ్లాల్ సారథ్యంలో ఈ సిట్ తన కార్యకలాపాలను ప్రారంభించింది. ముమ్మరంగా దర్యాప్తును కొనసాగిస్తోంది. నిర్దేశిత గడువులోగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్కు నివేదికను అందించనుంది.

ఈ పరిస్థితుల మధ్య విచారణలో కీలక పరిణామాలు సంభవించనున్నట్లు తెలుస్తోంది. సిట్ టీమ్లో మార్పులు చేయాలని చంద్రబాబు నిర్ణయించినట్లు చెబుతున్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కీలక పోస్టుల్లో పని చేసిన ముగ్గురు అధికారులను ఈ దర్యాప్తు బృందంలో సభ్యులుగా ఉండటమే దీనికి కారణమని అంటున్నారు.
సీఐడీ ఎస్పీ బీ ఉమా మహేశ్వర్, డీఎస్పీ ర్యాంక్ అధికారులు ఎం రత్తయ్య, తాటపర్తి అశోకవర్ధన్ రెడ్డి, ఎం బాలసుందర రావు, ఆర్ గోవిందరావును ఈ టీమ్లో చేర్చిన విషయం తెలిసిందే. దీనికి వినీత్ బ్రిజ్లాల్ సారథ్యాన్ని వహిస్తోన్నారు. ఇందులో తాటపర్తి అశోకవర్ధన్ రెడ్డి, ఎం బాలసుందర రావు, ఆర్ గోవిందరావు.. వైసీపీ అనుకూల అధికారులుగా ముద్ర ఉందనే ప్రచారం మొదటి నుంచీ ఉంది.
సిట్లో వారిని నియమించడం వల్ల దర్యాప్తు సమగ్రంగా కొనసాగకపోవచ్చనే అభ్యంతరాలు సైతం వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురినీ తప్పించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మార్పులు చేర్పులతో త్వరలోనే కొత్తగా ఉత్తర్వులు వెలువడొచ్చని సమాచారం.
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ పోర్టు నుంచి 4,995 కోట్ల రూపాయల విలువైన 13.41 లక్షల టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై 13 కేసులు కూడా నమోదయ్యాయి. ఈ కేసుల ఆధారంగానే ఇప్పుడు సిట్ దర్యాప్తు సాగిస్తోంది.












Click it and Unblock the Notifications