మణితేజ దారుణ హత్య: ప్రియుడు, ఫ్యామిలీ పరారీ, ఏం జరిగింది?
ఓ వైపు పేదరికంలో సమస్యలు ఎదుర్కొంటూనే ఆమె బీటెక్ పూర్తి చేసింది. ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ కుటుంబానికి అండగా నిలబడింది. కాగా, ఆమెకు చిన్ననాటి స్నేహితుడు..
ప్రకాశం: ఓ వైపు పేదరికంలో సమస్యలు ఎదుర్కొంటూనే ఆమె బీటెక్ పూర్తి చేసింది. ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ కుటుంబానికి అండగా నిలబడింది. కాగా, ఆమెకు చిన్ననాటి స్నేహితుడు.. ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. కానీ, అతడు మాత్రం చదువును దూరం పెట్టి ఆటో డ్రైవర్ అయ్యాడు. ఆకతాయిలతో తిరిగుతూ జులాయిగా మారాడు. చివరకు నమ్మించి ఆమె ప్రాణం తీశాడు.
ఈ విషాద గాథ వేటపాలెం మండలం రామాపురం గ్రామంలో శనివారం సాయంత్రం హత్యకు గురైన ఎంటెక్ విద్యార్థిని శవనం లక్ష్మీ మణితేజ(22)ది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఆమె చిన్ననాటి స్నేహితుడు ఉప్పుతేర్ల గోపీచంద్తో పాటు అతడి కుటుంబీకులు సైతం పరారయ్యారు. దీంతో నిందితుడి ఆచూకీ కోసం మూడు ప్రత్యేక పోలీసు బృందాలు పలు ప్రాంతాల్లో విస్తృతంగా గాలిస్తున్నాయి.
బయటికి పిలిపించి..
మణితేజ స్థానికంగా ఒక ద్విచక్ర వాహన షోరూంలో పని చేస్తూ తన కుటుంబానికి అండగా నిలుస్తోంది. కాగా, శనివారం మధ్యాహ్నం సుమారు ఒంటిగంట సమయంలో ఆమెకు గోపీచంద్ ఫోన్ చేసి బయటికి రప్పించాడు. ఆ సమయంలో నిందితుడు ఫోన్లో తీవ్రస్వరంతో మాట్లాడినట్లు తెలిసింది. ఆ సంభాషణ వివరాలు తెలిస్తే ఈ కేసు చిక్కుముడి వీడే అవకాశాలు ఉన్నాయి.
నమ్మించి తీసుకెళ్లి..
తేజ బయటికొచ్చాక గోపీచంద్ ఆమెను రామాపురంలోని తన మేనమామ ఇంటికి తీసుకెళ్లాడు. అతడి మేనమామ భార్య గర్భవతి కావటంతో ఆమె నాలుగు నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి ఆ ఇల్లు ఖాళీగా ఉంటోంది. వీరిద్దరూ ఆ ఇంటికి వెళ్లారు. ప్రధాన ద్వారం తాళం వేసి ఉండటంతో వెనుక గడియ పెకలించి లోనికి ప్రవేశించారు. ఆ తర్వాత తేజ హత్యకు గురైంది.
దారుణంగా గొంతుకోసి..
మణితేజ రెండు చేతులను మంచానికి కట్టేసిన నిందితుడు తొలుత ఆమెను గొంతు నులిమి చంపేందుకు యత్నించినట్లు అర్థమవుతోంది. ఆమె తీవ్రంగా ప్రతిఘటించినట్లు పోలీసులు కొన్ని ఆనవాళ్లను గుర్తించారు. చివరకు నిందితుడు కత్తితో గొంతు కోసి హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు. ఆమె మృతి చెందినట్లు నిర్ధారించుకున్న తర్వాత నిందితుడు సమీపంలో ఉన్న తన ఇంటికి వెళ్లి కుటుంబీకులకు విషయాన్ని వివరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆందోళనకు గురైన అతని కుటుంబీకులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. రోదిస్తూ అక్కడి నుంచి బయటకు వచ్చి వారు కూడా పరారయ్యారు.
పరారీలో నిందితుడు
నిందితుడు గోపీచంద్ ద్విచక్ర వాహనంపై బాపట్ల చేరుకుని తన వాహనాన్ని అక్కడి రైల్వేస్టేషన్ స్టాండులో పెట్టి, పరారైనట్లు పోలీసులు గుర్తించారు. తేజను కేవలం గోపీచంద్ ఒక్కడే హత్య చేశాడా..? అతనికి మరెవరైనా సహకరించారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా కలకలం సృష్టించిన ఈ కేసులో నిందితుడి ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. బాపట్ల రైల్వేస్టేషన్ స్టాండు నుంచి అతడు ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ప్రత్యేక బృందాలతో గాలింపు..
హత్యకు గురైన మణితేజ మృతదేహానికి పోలీసులు ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. అంతకు ముందు ఒంగోలు నుంచి వేలిముద్రల నిపుణులు వచ్చి పరిశీలించారు. హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డి తెలిపారు. అనంతరం మృతదేహాన్ని చీరాల వైద్యశాలకు తరలించారు. చీరాల పట్టణ, రెండో పట్టణ సీఐలు సూర్యనారాయణ, రామారావులు, వేటపాలెం ఎస్సై వెంకటకృష్ణయ్యలు ఉన్నారు. నిందితుడు గోపీచంద్ కోసం మూడు ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టామని, త్వరలో నిందితుడిని అరెస్టు చేస్తామని గ్రామీణ సీఐ పేర్కొన్నారు. కాగా, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. నిందితులకు కఠిన శిక్ష విధించాలని అన్నారు. కాగా, పోస్టుమార్టం అనంతరం తేజ మృతదేహాన్ని స్వగ్రామమైన పాత చీరాలకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. తేజ మృతితో కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.