Electricity Charges: విద్యుత్ ఛార్జీలు తగ్గింపుపై మంత్రి గొట్టిపాటి కీలక ప్రకటన
వైసీపీ ప్రభుత్వం తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు (Electricity Charges) పెంచి ప్రజలపై సుమారు రూ.30 వేల కోట్ల భారం మోపిందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ( Minister Gottipati Ravikumar) విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి దురాశ కారణంగా విద్యుత్ శాఖ సర్వనాశనం అయిందని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తూ ప్రస్తుతం సంస్కరణలను అమలు చేస్తున్నామని చెప్పారు. గుంటూరులో సిగ్నేచర్ కన్వెన్షన్ సెంటర్ ను మంత్రి గొట్టిపాటి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఛార్జీల తగ్గింపుపై కీలక ప్రకటన చేశారు
తక్కువ ధరకు, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందితే ఆంధ్రప్రదేశ్కు దేశ, విదేశాల నుంచి పెట్టుబడులు వస్తాయని మంత్రి అన్నారు. పెట్టుబడులు వస్తే ఆతిథ్య, పర్యాటక రంగాలకు ఊతం లభించడంతో పాటు, కన్వెన్షన్ సెంటర్లు, హోటళ్లు, అనుబంధ రంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయన్నారు. ఇది రాష్ట్ర యువత భవిష్యత్తుకు భరోసా ఇస్తుందని స్పష్టం చేశారు.

యూనిట్ విద్యుత్ ఛార్జీ..
కూటమి ప్రభుత్వం ఏర్పడిన సమయంలో యూనిట్ విద్యుత్ ఛార్జీ రూ.5.19గా ఉందని గుర్తు చేసిన మంత్రి, ఇప్పటివరకు 29 పైసలు తగ్గించామని తెలిపారు. ఈ తగ్గింపుతో ఏటా సుమారు రూ.2,320 కోట్ల ఆదా జరుగుతోందన్నారు. మరో 90 పైసలు తగ్గించేందుకు చర్యలు చేపట్టామని, మూడేళ్లలో యూనిట్ ఛార్జీని రూ.5.19 నుంచి రూ.4కు తగ్గించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. అలాగే 13 పైసల ట్రూ డౌన్ అమలు చేశామని తెలిపారు.
భారతదేశ చరిత్రలో విద్యుత్ ఛార్జీలను ట్రూ డౌన్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా రాబోయే మూడేళ్లలో యూనిట్ విద్యుత్ ఛార్జీలో రూ.1.19 వరకు తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. నాణ్యమైన విద్యుత్ను తక్కువ ధరలకు అందిస్తే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తాయని, దాంతో ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని ఆయన పేర్కొన్నారు.
సబ్స్టేషన్ ప్రారంభం
ఈ కార్యక్రమానికి ముందు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఇతర మంత్రులతో కలిసి ధర్మాజీగూడెంలో 132/32 కేవీ సబ్ స్టేషన్ను ప్రారంభించారు. ఈ సబ్ స్టేషన్ ద్వారా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న లో వోల్టేజ్ సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయని తెలిపారు. ఈ సబ్ స్టేషన్ పరిధిలోని లక్ష మంది రైతులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందిస్తామని చెప్పారు. పీక్ అవర్స్లో కూడా ఎలాంటి బ్రేక్డౌన్లు లేకుండా విద్యుత్ సరఫరా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఏటా పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలను విస్తరిస్తున్నామని తెలిపారు.












Click it and Unblock the Notifications