జగన్కు అసలు అగ్నిపరీక్ష: శాసన మండలి సంగతేంటీ? 19 నుంచి బడ్జెట్ భేటీ: అసెంబ్లీతో పాటు
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసలు సిసలు అగ్నిపరీక్షను ఎదుర్కొనబోతున్నారు. ఈ నెల 19వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆరంభం కాబోతోన్న ప్రస్తుత పరిస్థితులు అందరి దృష్టీ ఆయన మీదే నిలిచింది. శాసన మండలి విషయంపై ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. బడ్జెట్ ప్రతిపాదనలను సభలో ప్రవేశపెట్టడానికి అసెంబ్లీతో పాటు శాసన మండలిని కూడా సమావేశపరుస్తారా? లేదా? అనేది తేలాల్సి ఉంది.
అభిమాని పిలిచినా: జగన్తో భేటీకి బాలయ్య డుమ్మా: పైకి చెబుతోందొకటి: విషయం వేరొకటి?
మండలి రద్దు అనంతరం..
రాష్ట్ర ప్రభుత్వం శాసన మండలిని రద్దు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన వికేంద్రీకరణ బిల్లును తెలుగుదేశం పార్టీ శాసన మండలిలో అడ్డుకున్న దృష్ట్యా ఏకంగా దాన్ని రద్దు చేశారు వైఎస్ జగన్. దీనికి సంబంధించిన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. ఆమోదింపజేసుకున్నారు. దీన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. అక్కడితో శాసన మండలి రద్దయినట్టుగానే భావించవచ్చా? అంటే కాదనే అనుకోవాల్సి ఉంటుంది.
కేంద్రం ఆమోదిస్తేనే..
శాసన మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో చేసిన తీర్మాన ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉంది. శంఖంలో పోస్తేనే తీర్థమైనట్టు.. ఈ ప్రతిపాదనలు, తీర్మానంపై కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తేనే శాసన మండలి రద్దు అయినట్టు భావించుకోవాల్సి ఉంటుంది. ఈ తీర్మానాన్ని పార్లమెంట్ ఉభయ సభలో ప్రవేశపెట్టాలి.. దాన్ని ఆమోదింపజేసుకోవాలి. అప్పుడే శాసన మండలి రద్దయినట్టుగా భావిస్తారు. బీజేపీకి బలం ఉన్నందున ఈ తీర్మానాన్ని ఆమోదింపజేసుకోవడం పెద్ద సమస్య ఏమీ కాదు.
రాజకీయాలతో ముడిపడి ఉన్న అంశంగా..
కౌన్సిల్ రద్దు అనేది రాజకీయాలతో ముడిపడి ఉన్న అంశం. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి సారథ్యాన్ని వహిస్తోన్న భారతీయ జనతా పార్టీ.. ఈ తీర్మానాన్ని అంత సులువుగ ఆమోదిస్తుందనుకోవడం అత్యాశే అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. శాసన మండలిని కొనసాగించడం లేదా రద్దు చేయడం వంటి కీలక నిర్ణయాలను తీసుకునే విషయంలో బీజేపీ తన రాజకీయ అవసరాలను పరిగణనలోకి తీసుకోవడం ఖాయం. ఏకంగా తటస్థంగా ఉంటోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లబ్ది కలిగించేలా బీజేపీ నిర్ణయాన్ని తీసుకోకపోవచ్చని చెబుతున్నారు.
ఈ పరిణామాల మధ్య బడ్జెట్ సమావేశాలు..
ఈ పరిణామాల మధ్య బడ్జెట్ సమావేశాలు ఆరంభం కాబోతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్ర అసెంబ్లీ పంపించిన తీర్మానాన్ని కేంద్రం ఆమోదించకపోవడం.. పైగా వికేంద్రీకరణ బిల్లు గానీ, మండలి రద్దు అంశం గానీ ప్రస్తుతం హైకోర్టులో ఉండటాన్ని కారణంగా చూపించి.. శాసన మండలిని సమావేశపర్చడానికే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే వైఎస్ జగన్ ఓ మెట్టు కిందికి దిగినట్టే అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
బడ్జెట్ సమావేశాలపై భేటీ
కాగా ఈ నెల మూడోవారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించడానికి అధికార పార్టీ సన్నాహాలు చేస్తోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలను అనుసరించి శాసనసభను ఎలా నిర్వహించాలనే అంశంపై శుక్రవారం వైఎస్ జగన్ సమావేశాన్ని నిర్వహించారు. సభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, విప్ శ్రీనివాసులు, ప్రజా వ్యవహారాల సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి దీనికి హాజరు అయ్యారు.
రాజ్యసభ పోలింగ్ నాడే..
ఈ నెల 19వ తేదీన రాజ్యసభ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. రాజ్యసభ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ సాధారణంగా అసెంబ్లీ భవన సముదాయంలో నిర్వహిస్తుంటారు. ఈ ఓటింగ్లో పాల్గొనడానికి అన్ని పార్టీల శాసన సభ్యులు ఎలాగూ అసెంబ్లీకి రావాల్సి ఉంటుంది. దీన్ని పురస్కరించుకుని అదే రోజు బడ్జెట్ సమాావేశాలను ప్రారంభించాలని వైఎస్ జగన్ ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. వారం లేదా 10 రోజుల పాటు దీన్ని ఈ భేటీని నిర్వహించేలా షెడ్యూల్ను బిజినెస్ అడ్వైజరీ కమిటీలో చర్చిస్తారని అంటున్నారు.