నవ్వుతూ వచ్చి కలిశారు, ఎన్నో ఆశలు పెట్టుకున్నా: భూమా మృతిపై బాబు
దివంగత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి జీవితం మొత్తం పోరాట బాటలోనే సాగిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. గ్రామస్థాయి నుంచి అత్యున్నత స్థాయి వరకు సాగిన నాగిరెడ్డి.
అమరావతి: దివంగత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి జీవితం మొత్తం పోరాట బాటలోనే సాగిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. గ్రామస్థాయి నుంచి అత్యున్నత స్థాయి వరకు సాగిన నాగిరెడ్డి రాజకీయ ప్రస్థానం స్ఫూర్తిదాయకమని అన్నారు. ఇటీవల మృతిచెందిన భూమానాగిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సంతాపం ప్రకటించింది.
సోమవారం ఉదయం 9 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు భూమా నాగిరెడ్డి సంతాప తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. నాగిరెడ్డి మరణం రాయలసీమకు.. ముఖ్యంగా కర్నూలు జిల్లాకు తీరని లోటని అన్నారు. మూడేళ్ల వ్యవధిలోనే తల్లిదండ్రులను కోల్పోయిన వారి కుమార్తె, ఎమ్మెల్యే అఖిలప్రియకు అండగా ఉంటామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
భూమా నాగిరెడ్డి.. వర్తమాన రాజకీయాల్లోనూ, సభా కార్యక్రమాల్లోనూ చురుకైన పాత్రను పోషించారని చంద్రబాబు అన్నారు. ఆయనను ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు. తండ్రి బాల్ రెడ్డి ప్రత్యర్థుల చేతిలో హత్యగావింపబడటంతో పైచదువులు ఆపేసి రాజకీయ ప్రవేశం చేశారని చెప్పారు. అప్పట్నుంచి తనకు భూమా నాగిరెడ్డి తనకు బాగా తెలుసునని అన్నారు.
'భూమా మరణాన్ని ఇప్పటికే జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. మరణానికి ముందే 24గంటల్లో ఇంటికి వచ్చి కలిసి మాట్లాడారు. ఆ తర్వాత కొంత సేపటికే ఫుడ్ పాయిజన్ కారణంగా ఆస్పత్రిలో చేరినట్లు ఫోన్ చేశారు. తొందర్లోనే మళ్లీ వచ్చి కలుస్తానని చెప్పారు' అని చంద్రబాబు తెలిపారు.
'మా నాన్న గారు వచ్చి రేపు కలుస్తారని అఖిలప్రియ కూడా నాకు చెప్పారు. అంతలోనే అఖిలప్రియ.. టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్కు ఫోన్ చేసి భూమా పరిస్థితి సీరియస్గా ఉందని చెప్పారు. దీంతో ఈ విషయం లోకేష్.. నాకు చెప్పారు. వెంటనే మెరుగైన వైద్యానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా మంత్రి కామినేనికి, ప్రిన్సిపాల్ సెక్రటరీని ఆదేశించాను. అవసరమైతే హెలికాప్టర్ కూడా వినియోగించి మంచి వైద్యశాలకు తరలించాలని సూచించా. 24గంటల ముందు నవ్వుతూ వచ్చి కలిసిన వ్యక్తి.. అంతలోనే కన్నుమూశాడని తెలియడంతో చాలా బాధకు గురయ్యా' అని చంద్రబాబు చెప్పారు.
తనను కలిసినప్పుడు కూడా నియోజక వర్గ అభివృద్ధిపైనే చర్చించారని చెప్పారు. భూమా తాను ఎన్నో ఆశలు పెట్టుకున్నామని చంద్రబాబు తెలిపారు. సీమా రాజకీయాలపై భూమాది కీలక పాత్ర అని చెప్పారు.
భూమా రాజకీయ ప్రస్థానం స్ఫూర్తి దాయకమని చంద్రబాబు అన్నారు. నాగిరెడ్డి తొలిసారి టీడీపీ నుంచే ఎమ్మెల్యేగా గెలుపొందారని చెప్పారు. వరుసగా మూడుసార్లు ఎంపీగా కూడా గెలిచారని తెలిపారు. సీమ, కర్నూలు ముఠా కక్షలకు వ్యతిరేకంగా భూమా పోరాటం చేశారని, శాంతి యాత్రలు కూడా నిర్వహించారని చంద్రబాబు గుర్తు చేశారు. రైతుల బాగు కోసం అహర్నిశలు కృషి చేశారని అన్నారు. నీటి ప్రాజెక్టుల కోసం తపించారని అన్నారు.
ఇంటికెళ్లి పరామర్శించా
సభలో తనపై వైఎస్ వ్యక్తిగత దూషణలు కూడా చేశారని బాబు చెప్పారు. తననెంత అవమానించినా వైఎస్ చనిపోయినప్పుడు ఇంటికి వెళ్లి జగన్ను పరామర్శించానని చంద్రబాబు గుర్తుచేశారు. ఇడుపులపాయకు బయల్దేరి ట్రాఫిక్ వల్ల వెళ్లలేకపోయానని ఆయన వివరించారు. పులివెందులలో విజయమ్మ పోటీ చేస్తే అభ్యర్థిని కూడా నిలబెట్టలేదని చంద్రబాబు చెప్పారు.