ఏపీకి ఆ అవార్డు ప్రకటించిన కేంద్రం..!!
దేశ 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు న్యూఢిల్లీలో అంగరంగ వైభవంగా ముగిశాయి. కర్తవ్యపథ్లో నిర్వహించిన పరేడ్.. వివిధ రంగాల్లో దేశం సాధించిన పురోభివృద్ధికి అద్దం పట్టింది. రక్షణ మంత్రిత్వ శాఖ శక్తి సామర్థ్యాలు ఏమిటో ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది. స్వర్ణిమ్ భారత్- విరాసత్ ఔర్ వికాస్ అనే థీమ్తో ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలు కన్నుల పండువగా సాగాయి.
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబావో సుబియాంతో హాజరైన విషయం తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా ఇతర కేంద్రమంత్రులు, వివిధ శాఖలు, విభాగాల అధికారులు, దేశం నలుమూలల నుంచి వచ్చిన ఆహ్వానితుల మధ్య వైభవంగా జరిగాయి.

ఈ పరేడ్లో ఏపీ సహా వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాలు పాల్గొన్న విషయం తెలిసిందే. ఏపీ- ఏటికొప్పాక బొమ్మలు, ఉత్తరప్రదేశ్- మహా కుంభమేళా 2025, త్రిపుర- ఎటర్నల్ రెవెరెన్స్ కాన్సెప్టులతో సాగాయి. ఈ మూడింటితో పాటు హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్.. వంటి రాష్ట్రాల శకటాలు ఆహ్వానితులను ఆకట్టుకున్నాయి.
ఆయా శకటాలకు తాజాగా కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. మూడు అత్యుత్తమ శకటాలను ఎంపిక చేసింది. ఇందులో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం కొనసాగుతున్న మహా కుంభమేళాకు సంబంధించిన థీమ్తో ఈ శకటం రూపుదిద్దుకుంది. సాగరమథనాన్ని ప్రతిబింబించేలా అది రూపొందింది.
రెండో అవార్డు- త్రిపురకు లభించింది. ఖార్చీపూజా కాన్సెప్ట్తో తయారైందా శకటం. 14 దేవతామూర్తులను ఎలా పూజిస్తారనే థీమ్ను ఇందులో ప్రదర్శించారు. ఎటర్నల్ రెవెరెన్స్ అనే పేరుపెట్టారు. దీనికి రెండో అత్యుత్తమ శకటం అవార్డు లభించింది.
మూడో అవార్డు ఏపీకి లభించింది. ఎకో ఫ్రెండ్లీ థీమ్తో ఈ శకటం రూపొందింది. చారిత్రాత్మక ఏటికొప్పాక బొమ్మలను ఈ శకటం ద్వారా ప్రపంచ దేశాలకు పరిచయం చేసింది ప్రభుత్వం. పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించని విధంగా అందమైన బొమ్మలను ఎలా సృష్టించవచ్చో వివరించింది.












Click it and Unblock the Notifications