బ్లాక్ చైన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్గా ఆంధ్రప్రదేశ్: మంత్రి నారా లోకేశ్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ను బ్లాక్ చైన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తాను పనిచేస్తున్నట్లు ఏపీ ఐటి శాఖా మంత్రి నారా లోకేశ్ చెప్పారు. ఇంతకీ బ్లాక్ చైన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ గా అంటే ఏంటా అనుకుంటున్నారా?...అయితే బ్లాక్ చైన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం...
ప్రతి పనిలో టెక్నాలజీ వినియోగం సర్వసాధారణంగా మారిన ఈ తరుణంలో ఆ సాంకేతికతకు సైబర్ ఎటాక్స్ వల్ల ఎలాంటి ప్రమాదం లేకుండా చూడటాన్నే బ్లాక్ చైన్ టెక్నాలజీగా అభివర్ణిస్తారు. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో బ్లాక్ చైన్ టెక్నాలజీ అభివృద్దికి ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ, కోవలెంట్ ఫండ్ సంస్థల మధ్య శుక్రవారం ఒప్పందం కుదిరింది. ఎపి ఐటి మినిస్టర్ లోకేశ్ సమక్షంలో ఆ రెండు సంస్థలు ఎంవోయు కుదుర్చుకున్నాయి. ఈ సందర్భంగా కోవలెంట్ ఫండ్ ప్రతినిధులను మంత్రి లోకేశ్ సచివాలయంలో ఏర్పాటు చేసిన రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ కు తీసుకొని వెళ్లి రాష్ట్రంలో అమలు చేస్తున్నఆర్టీజిఎస్ విధానం గురించి వివరించారు.

బ్లాక్ చైన్ టార్గెట్ 2019...
బ్లాక్ చైన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్గా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దేందుకు బ్లాక్ చైన్ టార్గెట్ 2019 ను అమలు చెయ్యనున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. ఇందులో భాగంగా ఎపిలో బ్లాక్ చైన్ టెక్నాలజీ యూనివర్సిటీ ఏర్పాటుకు కోవలెంట్ ఫండ్ తో తాజా ఒప్పందం ఎంతగానో ఉపయోగపడుతుందని లోకేష్ వివరించారు. అలాగే 2019 లోపు 5000 మంది విద్యార్థులకు ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ లో ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. అతి త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ చైన్ టెక్నాలజీకి ఎంతో డిమాండ్ ఏర్పడుతుందని, అందుకోసం రాష్ట్ర యువతి యువకులకు కోవలెంట్ ఫండ్ ద్వారా శిక్షణ ఇచ్చి భవిష్యత్తులో ఉద్యోగాలు అందిపుచ్చుకునేలా చెయ్యడమే ఈ ఒప్పందం లక్ష్యమని మంత్రి నారా లోకేష్ వివరించారు.

విశాఖలో...బ్లాక్ చైన్ టెక్నాలజీ బిజినెస్ కాన్ఫరెన్స్
ఇటీవలే విశాఖపట్నంలో బ్లాక్ చైన్ టెక్నాలజీ బిజినెస్ కాన్ఫరెన్స్ నిర్వహించామని, బ్లాక్ చైన్ టెక్నాలజీలో మన రాష్ట్ర యువతి యువకులు ఉద్యోగాలు సాధించేందుకు హ్యాకథాన్స్ కూడా నిర్వహించనున్నామన్నారు. ఎపిలో స్టార్ట్ అప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిందన్నారు.

రాష్ట్ర విభజన...సమస్యలు
రాష్ట్ర విభజన తరువాత అనేక సమస్యలు ఎదుర్కొన్నామని, ఆ సమస్యలు అధిగమించి, ప్రజలకు మెరుగైన సేవలు, సంక్షేమ కార్యక్రమాలు అందించడానికి రాష్ట్రంలో పెద్ద ఎత్తున టెక్నాలజీని వినియోగిస్తున్నామని మంత్రి లోకేష్ ఈ సందర్భంగా తెలిపారు. పరిపాలనలో రియల్ టైం గవర్నెన్స్ వినియోగమనేది ఒక అద్భుతమని, తద్వారా ప్రజల సమస్యలు తెలుసుకొని తక్షణమే పరిష్కరించడానికి వీలవుతుందని లోకేష్ చెప్పారు. ఆర్టిజిఎస్ తో సీఎం కోర్ డ్యాష్ బోర్డ్ ద్వారా రాష్ట్రంలో జరిగే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, వాటి అమలు గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని తెలిపారు.

టెక్నాలజీ వినియోగం...ఇంకా ఎక్కడంటే...
ఏపీ పరిపాలన లో టెక్నాలజీ వినియోగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి లోకేష్ వివరించారు. రాష్ట్రంలో ఫైబర్ నెట్ ద్వారా 149 రూపాయిలకే టెలివిజన్, వైఫై, టెలిఫోన్ సేవలు అందిస్తున్నామన్నారు. రాజధాని ప్రాంతంలో ల్యాండ్ రికార్డ్స్ టాంపరింగ్ జరగకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీ వినియోగిస్తున్నట్లు తెలిపారు. అలాగే సర్టిఫికెట్ల కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా డిజిటల్ లాకర్ , ఆధార్ నెంబర్ ద్వారా అన్ని సర్టిఫికెట్లు ఆన్ లైన్ లో ఇచ్చే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు లోకేష్ తెలిపారు.












Click it and Unblock the Notifications