జగన్వి పిల్ల చేష్టలు: కేంద్రం హెచ్చరించినా:రాజధాని అమరావతిలోనే ఉండాలి: కన్నా..!
రాజధాని తరలింపు ప్రతిపాదనలు..కమిటీ సిఫార్సుల మీద అమరావతి ప్రాంత రైతులు మండిపడుతున్నారు. రాజధాని ప్రాంతానికి చెందిన రైతులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు కలిసారు. రాజధాని మార్పును అడ్డుకోవాలని కోరారు. ప్రధాని..అమిత్ తో అప్పాయింట్ మెంట్ కోరాలని..తమ ఆవేదన చెప్పుకొనే అవకాశం ఇవ్వాలని అభ్యర్ధించారు.
గత వారం రోజులుగా అమరావతిలో జరుగుతున్న రైతుల దీక్షలు..నిరసనల గురించి వివరించారు. దీనికి కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. ముఖ్యమంత్రి తీరు మీద మండిపడ్డారు. జగన్ పాలనలో కక్షసాధింపు ధోరణి కనపడుతోందన్నారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి మారితే రాజధాని మారుతుందా..
జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలు సంతోషంగా లేరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ మారినప్పుడల్లా విధానాలు మారుస్తామనే విధంగా జగన్ వ్యవహరిస్తు న్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ వైఖరి కక్ష్యధోరణి కనిపిస్తుందన్నారు. రాజధాని మార్పు అంశంతో అమరావతి ప్రాంత రైతులను భయపెడుతున్నారని వ్యాఖ్యానించారు.
ఇలాంటి పిచ్చి పనులు సరికావని
ముఖ్యమంత్రి మారితే రాజధాని మారుతుందనే వింత వైఖరిని తెరపైకి తెచ్చారని.. ఇలాంటి పిచ్చి పనులు సరికావని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. భయంతో బతకాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. జగన్వి పిల్ల చేష్టలని ఆయన మండిపడ్డారు. ఇది రైతుల సమస్య కాదని.. రాజధాని సమస్య అని అన్నారు. కేంద్రం హెచ్చరించినా జగన్ నియంతృత్వ ధోరణితో వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతిలోనే రాజధాని ఉండాలి..
రాజధాని అమరావతిలోనే ఉండాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. మూడు రాజధానుల నిర్ణయం పరిపాలనకు విఘాతం కలిగిస్తుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ నిర్ణయాలు లక్షలాది మంది మీద ప్రభావం చూపిస్తున్నాయని మండిపడ్డారు. రైతులు ప్రధాని వద్దకు తమకు వెళ్లే అవకాశం కల్పించాలని కోరగా..తాను సమాచారం అందిస్తానని..అందుకు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.
ఇప్పటికే బీజేపీ నేతలు రాజధాని ప్రాంత రైతులకు మద్దతు ప్రకటించారు. ఈ విషయం కేంద్రానికి నివేదిస్తామని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ప్రకటించారు. పొగాకు బోర్డు ఛైర్మన్ యడ్లపాటి రఘునాధ బాబు రైతుల ఆందోళనలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. అయితే, ఒకటి రెండు రోజుల్లోనే ఏపీ బీజేపీ నేతలు దీని పైన కేంద్ర ప్రభుత్వం..బీజేపీ జాతీయ ప్రముఖులతో చర్చించి..తమ విధానం ఏంటనేది స్పష్టత ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది.