జగన్ కు ఆ ధైర్యం లేక చిన్నగా జారుకున్నాడు, అంతేగా, బీజేపీ మంత్రి
వైసీపీ అధినేత వైయస్ జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకుని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తనను కావాలనే తిరుమలకు పంపించలేదని, తాను తిరుమల వెళ్లకుండా పోలీసులు నోటీసులు జారీ చేశారని, ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని మాజీ సీఎం జగన్ శుక్రవారం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
జగన్ ఆరోపణలపై ఇప్పటికే కూటమి ప్రభుత్వంలోని మంత్రులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. జగన్ ఆరోపణలను టీడీపీ, జనసేన నాయకులు ఖండించారు. ఇప్పుడు జగన్ విషయంలో బీజేపీ ఎంట్రీ ఇచ్చింది. జగన్ కావాలనే తిరుమల పర్యటన రద్దు చేసుకొని కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు. ధర్మవరంలో మీడియాతో మాట్లాడిన మంత్రి సత్య కుమార్ మాజీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

తిరుమలలో డిక్లరేషన్ పై సంతకం చేసే ధైర్యం లేక జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారని మంత్రి సత్యకుమార్ ఆరోపించారు. తిరుమలకు వెళ్లే ధైర్యం లేక మాపైన జగన్ ఆరోపణలు చేయడం సరికాదని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. శ్రీవారి లడ్డు ప్రసాదంలో వినియోగించే నెయ్యి విషయంలో జగన్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి, బీజేపీ నాయకుడు సత్యకుమార్ ఆరోపించారు.
జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన బాబాయ్ వైవీ. సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ అయ్యారని, ఆ తర్వాత జగన్ కు అత్యంత సన్నిహితుడు భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ అయ్యారని మంత్రి సత్యకుమార్ యాదవ్ గుర్తు చేశారు. ఆ సందర్భంలో వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఏవీ. ధర్మారెడ్డిని టీటీడీ ఈవోగా నియమించారని, ఆ సమయంలోనే శ్రీవారి లడ్డు తయారు చేయడానికి కల్తీ నెయ్యి ఉపయోగించారని మంత్రి సత్యకుమార్ ఆరోపించారు.

మాజీ సీఎం జగన్, వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఏవి ధర్మారెడ్డిని ఆ వెంకటేశ్వరస్వామి ఎట్టి పరిస్థితుల్లో క్షమించరని, త్వరలోనే ఆ దేవుడు వీళ్లకు సరైన శిక్ష విధిస్తారని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. కోట్లాదిమంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వాళ్ళు ఎవ్వరు కూడా శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి కేసు నుండి తప్పించుకోలేరని, అందరికీ సరైన శిక్ష పడుతుందని మంత్రి సత్యకుమార్ అన్నారు. జగన్, వైసీపీ నాయకులు చేసిన ఆరోపణలపై ఇప్పటికే టీడీపీ, జనసేన నాయకులు కౌంటర్ ఇవ్వడంతో ఇప్పుడు బీజేపీ మంత్రి సత్యకుమార్ కూడా ఘాటుగా జగన్ కు కౌంటర్ ఇవ్వడంతో కథ రసవత్తరంగా మారుతుంది.












Click it and Unblock the Notifications