ఏపీ కేబినెట్ సమావేశం షెడ్యూల్ ఫిక్స్: కొత్త మంత్రులతో వైఎస్ జగన్ తొలి భేటీ
అమరావతి: రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ముహూర్తం కుదిరింది. పలు కీలక అంశాలు ఈ భేటీలో చర్చకు రానున్నాయి. రాష్ట్రాభివృద్ధికి దిశానిర్దేశం చేసే పలు ప్రతిపాదనలపై మంత్రివర్గం చర్చించనుంది.. వాటిపై ఆమోదముద్ర వేయనుంది. విద్యుత్ కోతల నివారణ, మంచి నీటి ఎద్దడి, సాగునీరు, పోలవరం ప్రాజెక్ట్ వంటి విషయాలతో పాటు మూడు రాజధానుల ప్రక్రియను వేగవంతం చేయడం, పరిశ్రమలకు భూముల కేటాయింపు వంటివి మంత్రివర్గంలో చర్చకు వస్తాయని తెలుస్తోంది. కొన్ని కొత్త పథకాలకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలుపుతుందని సమాచారం.
సర్కారువారి పాటపై వైసీపీ బ్రాండ్: బ్యానర్లల్లో జగన్, వంగవీటి రంగా, ఎమ్మెల్యేల ఫొటోలు
13న సచివాలయం వేదికగా..
ఈ నెల 13వ తేదీన ఉదయం 11 గంటలకు సచివాలయంలో మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ భేటీలో చర్చించాల్సిన అంశాలు, ఇతర ప్రతిపాదనలకు సంబంధించిన వివరాలను పంపించాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయం అన్ని శాఖలు, విభాగాధిపతులకు ఇదివరకే సర్కులర్ జారీ చేసింది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశ పెట్టాల్సిన బిల్లుల గురించి చర్చిస్తుంది.
అవగాహన పెంచుకోవడానికే..
కిందటి నెలలో మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు వైఎస్ జగన్. మంత్రులందరూ బాధ్యతలను స్వీకరించారు. సమీక్షలతో తీరిక లేకుండా గడుపుతున్నారు. కొందరు మంత్రులు క్షేత్రస్థాయిలోనూ పర్యటనలను నిర్వహిస్తోన్నారు. అదే సమయంలో తమకు కేటాయించిన జిల్లాల బాధ్యతలనూ నిర్వర్తిస్తున్నారు. తమ శాఖలపై అవగాహనను పెంచుకున్నారు.. పట్టు సాధించారు. ఇప్పుడిక వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరు కానున్నారు.
కొత్త మంత్రులతో తొలిసారిగా..
మంత్రులు బాధ్యతలను స్వీకరించిన వెంటనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ.. వారికి అవగాహన ఏర్పడాలనే ఉద్దేశంతో జాప్యం చేశారని అంటున్నారు. ఈ పరిణామాల మధ్య వైఎస్ జగన్.. తన కొత్త కేబినెట్ సహచరులతో సమావేశం కానున్నారు. శాఖలవారీగా సమీక్షలను నిర్వహించనున్నారు. పలు అంశాలపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే కేబినెట్తో వైఎస్ జగన్ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్నందున అటు రాజకీయ కోణంలోనూ ఈ కేబినెట్ భేటీకి ప్రాధాన్యత లభించింది.
రాజకీయ సవాళ్లపైనా..
ఈ రెండున్నరేళ్ల కాలంలో తమకు ఎదురయ్యే రాజకీయ సవాళ్లను ఎదుర్కొనడంతో పాటు తమ శాఖల పనితీరును ప్రజల్లోకి తీసుకెళ్లడంపై మార్గదర్శనం చేస్తారు. ప్రతిపక్ష తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ-దాని మిత్రపక్షం జనసేన నాయకులు తరచూ చేస్తోన్న రాజకీయ పరమైన దాడులు, విమర్శలను ఎలా తిప్పికొట్టాలనే విషయంపై వైఎస్ జగన్.. మంత్రులకు దిశానిర్దేశం చేసే అవకాశం లేకపోలేదు. ప్రభుత్వం చేసే పనులను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికీ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడుతున్నారు.
పోలవరం సహా..
జల వనరులశాఖ మంత్రి హోదాలో అంబటి రాంబాబు ఇదివరకే పోలవరం ప్రాజెక్ట్ను పరిశీలించారు. అక్కడి పనులను పర్యవేక్షించారు. ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం గురించి, పనుల పురోగతిపై వైఎస్ జగన్ ఆరా తీయడం ఖాయంగా కనిపిస్తోంది. నిర్ణీత గడువులోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనే అంశాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో- పనుల పురోగతి, నిధుల వ్యయం వంటివి కీలకంగా మారనున్నాయి.