కాస్సేపట్లో ఏపీ కేబినెట్: కొత్త జిల్లాలపై అధ్యయన కమిటీ..ఇసుక కార్పొరేషన్? రాజధానులపై
అమరావతి: రాష్ట్ర మంత్రివర్గం కాస్సేపట్లో సమావేశం కాబోతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వెలగపూడి సచివాలయంలో ఉదయం 11 గంటలకు మంత్రులు సమావేశం కానున్నారు. పలు కీలక అంశాలు ఈ సమావేశంలో చర్చకు రాబోతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుపై కీలక నిర్ణయాన్ని తీసుకోవచ్చని తెలుస్తోంది. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటించే దిశగా కేబినెట్ భేటీలో తీర్మానాన్ని రూపొందిస్తారని అంటున్నారు.
నిశ్శబ్దాన్ని వీడనున్న సచిన్: కొత్త పార్టీ?: కాంగ్రెస్కు నిద్రలేకుండా: ఆ కమ్యూనిటీ ఓటుబ్యాంకు
అధ్యయన కమిటీకి ఆమోదం..
కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయనం చేయడానికి అవసరమైన కమిటీని ఏర్పాటు చేయడానికి మంత్రివర్గం ఆమోదిస్తుందని సమాచారం. కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామంటూ వైఎస్ జగన్ ప్రకటించిన తరువాత.. కొన్ని డిమాండ్లు వినిపించాయి. పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రం కాకుండా.. దాని పరిధిలో అభివృద్ధి చెందిన పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్లు వ్యక్తం అయ్యాయి. ఉదాహరణకు-చిత్తూరు జిల్లాలోని మదనపల్లి.. కడప జిల్లాలోని రాజంపేట లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉంది. రాజంపేటను జిల్లా కేంద్రంగా మార్చడం వల్ల మదనపల్లి నుంచి రాకపోకలు సాగించడం కష్టతరమౌతుంది. ఈ తరహా డిమాండ్లు చాలా ఉన్నాయి.
అలాంటి వాటిపై అధ్యయనం చేయడానికి..
అలాంటి డిమాండ్లు, సమస్యలపై అధ్యయనం చేయడానికి రిటైర్డ్ ఐఎఎస్ అధికారితో ఓ కమిటీని నియమించడానికి మంత్రివర్గం ఆమోదిస్తుందని అంటున్నారు. దీనితోపాటు- మూడు రాజధానుల ఏర్పాటు విషయంపైనా మంత్రివర్గంలో చర్చించడానికి అవకాశం ఉంది. విశాఖపట్నంలో సచివాలయాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన కార్యక్రమాలను వేగవంతం చేయడంపైనా మంత్రివర్గం చర్చిస్తుందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం సహా డీజీపీ కార్యాలయాన్నీ విశాఖపట్నానికి తరలించడానికి మంత్రివర్గం ఆమోదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇసుక కార్పొరేషన్ ఏర్పాటుపై
రాష్ట్రంలో ఇసుక సమస్య ఉధృతంగా ఉంటోంది. ఇసుక పాలసీ పట్ల అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి సైతం అసంతృప్తి వ్యక్తమైన సందర్భాలు ఉన్నాయి. దీన్ని పరిష్కరించేలా మంత్రివర్గం కీలక నిర్ణయాన్ని తీసుకుంటుందని అంటున్నారు. ఇందులో భాగంగా ఇసుక కార్పొరేషన్ను ఏర్పాటు చేయడానికి తీర్మానం రూపొందిస్తుందని అంటున్నారు. ఈ కార్పొరేషన్ ద్వారా ఇసుక సరఫరాను క్రమబద్దీకరిస్తారని తెలుస్తోంది.
Recommended Video
వలంటీర్ల వేతనాల పెంపుపై..
వైఎస్ జగన్ బ్రెయిన్ ఛైల్డ్గా గుర్తింపు పొందిన గ్రామ/వార్డు వలంటీర్ల వేతనాల పెంపు అంశం కూడా మంత్రివర్గంలోకి చర్చకు రావచ్చని అంటున్నారు. దీనికి అయ్యే అదనపు ఖర్చు, విధి విధానాలపై ఆర్థికమంత్రిత్వ శాఖ ఇప్పటికే కసరత్తు చేసిందని తెలుస్తోంది. దీని గురించి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఓ ప్రతిపాదనను సిద్ధం చేశారని, దీనికి మంత్రివర్గం ఆమోదించే అవకాశం ఉందని సమాచారం. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో వలంటీర్ల సేవలు కీలకంగా మారాయి. దీనితో వారి సేవలను గుర్తించేలా వేతనాన్ని పెంచవచ్చని అంటున్నారు.