తప్పులు చేశాను: చంద్రబాబు, రేటింగ్పై బెజవాడలో ఎమ్మెల్యేలకు క్లాస్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ విస్తరణ అతి త్వరలో ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టూకీగా చెప్పారు. బుధవారం విజయవాడలో కొంతమంది కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలతో సమన్వయ సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో ఈ విషయాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారని తెలుస్తోంది.
అయితే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని చెప్పిన చంద్రబాబు... ఎప్పుడు జరుపుతామన్న విషయాన్ని మాత్రం దాటవేసి ఆశావహుల్లో ఉత్కంఠకు తెర లేపారు. డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు సహా 25 మంది దాకా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
రానున్న కాలంలో చేపట్టాల్సిన రాజకీయ కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ ప్రస్తావన తెచ్చారు. ''ఇప్పుడు మంత్రివర్గంలో 20 మంది ఉన్నారు. ఇంకా ఇద్దరో, ముగ్గురో రావడానికి అవకాశముంది. అందుచేత విస్తరణ ఉంటుంది'' అని చంద్రబాబు వ్యాఖ్యానించారని తెలుస్తోంది.
అయితే మంత్రివర్గ విస్తరణను ఎప్పుడు చేపడతారనే విషయాన్ని మాత్రం ఆయన ప్రస్తావించలేదు. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుందో చెప్పండంటూ సమావేశానికి హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు అడగే సాహాసం చేయలేదు. కాగా మున్సిపల్ ఎన్నికల తర్వాత ఈ ఏడాది చివరలో (డిసెంబర్లో) ఉండవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అలాగే ఎమ్మెల్యేలు ప్రజల మద్దతు సాధించాలని చంద్రబాబు హితబోధ చేశారు. 'వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో 80శాతం మంది ప్రజలు మనతో ఉండాలి. టీడీపీ రాజకీయంగా తిరుగులేని శక్తిగా నిలదొక్కుకోవాలి. అప్పుడు మనం అనుకున్న రాజకీయ లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం' అని ఆయన పేర్కొన్నారు.
ఇటీవల చేయించిన పార్టీ అంతర్గత సర్వేలో ప్రభుత్వంపై వ్యక్తమైనంత సానుకూలత అందరు ఎమ్మెల్యేల పై రాకపోవడాన్ని దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు ఈ సమావేశం నిర్వహించారని తెలుస్తోంది. 'ప్రభుత్వ పథకాలు అన్ని నియోజకవర్గాల్లో సమానంగా అమలవుతున్నాయి. కానీ ప్రజల దృష్టిలో కొందరు ఎమ్మెల్యేలకు ఎక్కువ మార్కులు పడుతుంటే కొందరికి తక్కువ వస్తున్నాయని ప్రశ్నించారు.
ఒకే నియోజకవర్గంలో ప్రభుత్వానికి రేటింగ్ బాగా వస్తుంటే అక్కడి ఎమ్మెల్యేకు మాత్రం అంత రేటింగ్ రావడం లేదు. ఈ తేడా ఎందుకు వస్తోంది? దానిని ఎలా సవరించుకోవాలన్నది ఇప్పుడు మన ముందున్న సమస్య అని పేర్కొన్నారు. ఎన్నికల ముందు సర్వేలు చేయించి రేటింగ్ బాగోలేని వారిని పక్కన పెట్టడం వంటివి నేను చేయదల్చుకోలేదని చెప్పారు.
ప్రతి ఎమ్మెల్యే రాజకీయంగా బలపడేందుకు అనువైన సూచనలు, మద్దతు ఇవ్వాలన్నది నా ఆలోచనగా పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇనఛార్జులందరికీ శిక్షణ కార్యక్రమాలు చేపట్టబోతున్నామని చెప్పారు. వీటిని మీరంతా పూర్తి స్థాయిలో వినియోగించుకోండని చంద్రబాబు వారికి పిలుపిచ్చారు.
ఆగస్టు మొదటి వారం నుంచి ఇవి మొదలవుతాయని, మూడేసి రోజులు శిక్షణ ఇస్తామని ఈ సమావేశంలో వివరించారు. తప్పులు తానూ చేశానని, వాటిని ఈసారి దిద్దుకొంటూ వెళ్తున్నానని... దిద్దుబాట తప్పేమీ కాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
'పోయినసారి నేను ముఖ్యమంత్రిగా ఉండగా చాలా కార్యక్రమాలు అమలు చేశాను. కాని ఇమేజీ ఒరవడిలో కొట్టుకుపోయి కొన్ని తప్పులు చేశాను. ఈసారి అలాంటి వాటికి ఆస్కారమివ్వడం లేదు. అభివృద్ధి... సంక్షేమం రెంటికీ సమ ప్రాధాన్యమిస్తూ పనిచేస్తున్నానని చెప్పారు. టెక్నాలజీని అందరూ అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు.