27న ఏపీ కేబినెట్: రచ్చబండ తరహా: జిల్లాల్లో విస్తృత పర్యటన దిశగా వైఎస్ జగన్
అమరావతి: మంత్రివర్గ సమావేశానికి ముహూర్తం ఖాయమైంది. వచ్చేనెల 27వ తేదీన కేబినెట్ భేటీ కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. అమరావతి ప్రాంతంలోని వెలగపూడి సచివాలయం మొదటి బ్లాక్లో ఉదయం 11 గంటలకు మంత్రులు సమావేశమౌతారు.
రాష్ట్రంలో అమలవుతోన్న సంక్షేమ పథకాలపై మంత్రివర్గంలో సమీక్షిస్తారు. వచ్చేనెల 25వ తేదీన ప్రారంభించ తలపెట్టిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఎక్కడ చేపట్టాలనే విషయంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొత్త పథకాలు, భూముల కేటాయింపుపై ఆమోదముద్ర వేస్తారని తెలుస్తోంది.

రచ్చబండ తరహా..
రాష్ట్రంలో కరోనా వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఈ మధ్యకాలంలో రెండువేల లోపే కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఒకట్రెండు చోట్ల మినహా మెజారిటీ జిల్లాల్లో రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రెండంకెలకే పరిమితం అయ్యాయి. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. జిల్లాల్లో విస్తృతంగా పర్యటించాలని వైఎస్ జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
సంక్షేమ పథకాల అమలు తీరును పర్యవేక్షించడానికి రచ్చబండ తరహా కార్యక్రమాన్ని చేపట్టొచ్చని, దీనిపై మంత్రివర్గంలో చర్చిస్తారని తెలుస్తోంది. వైఎస్ఆర్ ఆసరా, రైతు భరోసా, అమ్మఒడి, విద్యాదీవెన, నాడు-నేడు వంటి పథకాల డెలివరీ వ్యవస్థల్లో లోటుపాట్లు ఉంటే..వాటిని సరిచేయడానికి అవసరమైన ఫీడ్బ్యాక్ను సేకరించేలా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయనున్నట్లు సమాచారం.

స్థానిక సంస్థల ఎన్నికలపైనా
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలనే అంశం కూడా ఈ సందర్భంగా మంత్రులు చర్చిస్తారని తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి ఇది సరైన సమయం కాదంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ ఇదివరకే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ అంశం మరోసారి కేబినెట్ ముందుకు వచ్చే అవకాశం లేకపోలేదు.
Recommended Video

భూముల కేటాయింపుపై..
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో వారికి కేటాయించాల్సిన భూములపై మంత్రివర్గం ఆమోదముద్ర వేస్తుందని తెలుస్తోంది. కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టు నిధులను రాబట్టుకోవడం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, పోతిరెడ్డిపాడు-గోరకల్లు ప్రాజెక్ట్.. వంటి అంశాలన్నీ మంత్రివర్గం ముందుకు చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 100 అడుగుల విగ్రహాన్ని పోలవరం ప్రాజెక్టు వద్ద నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించినందున.. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై కేబినెట్ ఆమోదముద్ర వేయొచ్చని అంటున్నారు.












Click it and Unblock the Notifications