కాల్ మనీ: జిల్లాలవారీగా, పార్టీలవారీగా నమోదైన కేసులు ఇవే..
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న కాల్మనీ వ్యవహారంలో ఇప్పటివరకు 118 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో వివిధ పార్టీలకు చెందినవారున్నారు. ఈ వ్యవహారంలో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 123 కేసులు నమోదయ్యాయి.
కాల్ మనీ వ్యవహారాలకు కేంద్రంగా భావిస్తున్న విజయవాడలోనే 42 కేసులు నమోదయ్యాయి. విజయవాడలో 36మంది నిందితుల్లో 13 మంది తెలుగుదేశం పార్టీకి చెందినవారు కాగా, 11 మంది కాంగ్రెస్, ఆరుగురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి, ముగ్గురు సీపీఐకి చెందినవారు.
జిల్లాల వారీగా నమోదైన కేసులు ఈ విధంగా ఉన్నాయి - తూర్పుగోదావరి జిల్లాలో 24 కేసులు నమోదయ్యాయి. 24 మంది నిందితుల్లో 13 మంది వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి, ఇద్దరు టిడిపికి చెందినవారు. రాజమండ్రిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన నాయకుడిపై కేసు నమోదుచేశారు.
కృష్ణా జిల్లాలో 13 కేసులను పోలీసులు నమోదుచేశారు. ఈ నిందితుల్లో ముగ్గురు వైసిపికి, ఒకరు కాంగ్రెస్కు చెందినవారు. గుంటూరులో 9 కేసులు నమోదుకాగా, వారిలో ముగ్గురు వైసిపి, ఇద్దరు టిడిపికి, ఒకరు కాంగ్రెస్ పార్టీకి చెందినవారు ఉన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురిపై మూడు కేసులు నమోదయ్యాయి. విజయనగరంలో 9 కేసులు నమోదయ్యాయి. తొమ్మిది మంది నిందితులు కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందినవారే. విశాఖ రూరల్లో రెండు కేసులను పోలీసులు నమోదుచేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 10 కేసులు నమోదుకాగా, పదిమంది నిందితుల్లో ముగ్గురు వైసిపికి, ఒకరు టిడిపికి చెందినవారు.
కడప జిల్లాలో ఏడు కేసులను పోలీసులు నమోదుచేశారు. వీరిలో నలుగురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందినవారు ఉన్నారు. ప్రకాశం జిల్లాలో ఒక కేసు, నెల్లూరు జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలోనూ కేసులు నమోదయ్యాయి. దాదాపుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలను కాల్ మనీ భూతం కుదిపిస్తోంది.