నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పదవి మార్పు...ఇరిగేషన్ నుంచి హౌసింగ్ ఛైర్మన్
అమరావతి:ఇటీవల వివిధ కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం సందర్భంగా చెలరేగిన అసమ్మతులను బుజ్జగించేందుకు సిఎం చంద్రబాబు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. తనకు కడప రీజీనల్ ఆర్టీసీ ఛైర్మెన్ పదవి ఇవ్వడంపై భగ్గుమని తిరుగుబాటు బావుటా ఎగురవేసిన చల్లా రామకృష్ణారెడ్డిని చల్లబరిచేందుకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన చంద్రబాబు ఆ క్రమంలో ఆయనకు సివిల్ సప్లయీస్ కార్పోరేషన్ ఛైర్మెన్ పదవిని ఆఫర్ చేశారట. దీంతో చల్లా కొంత మెత్తబడ్డారని తెలుస్తోంది.
ఇక పార్టీలో సీనియర్లు, జూనియర్లు అనే వాదనతో చెలరేగిన అసంతృప్తి జ్వాలలను చల్లబర్చేందుకు మరో రెండు కార్పొరేషన్ చైర్మన్ల నియామకాల్లోనూ సిఎం స్వల్పమార్పులు చేసినట్లు తెలిసింది. ఇటీవలే టిడిపిలో చేరిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డికి తొలుత ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పదవి ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఎపి స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా అదే జిల్లాకు చెందిన నామన రాంబును నియమించారు.
అయితే ఆ తరువాత కొన్ని సమీకరణాల రీత్యా నామన రాంబాబు, నల్లారి కిషోర్కుమార్రెడ్డి పదవులను సిఎం చంద్రబాబు జంబ్లింగ్ చేశారని తెలిసింది. నల్లారి కిషోర్కుమార్రెడ్డిని ఎపి ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి ఎపి స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించారని సమాచారం. అదేవిధంగా ఎపి స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించిన నామన రాంబును ఎపి ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కేటాయించినట్లు తెలిసింది. అంటే వీరిద్దరి ఛైర్మన్ పదవులనే పరస్పరం మార్చినట్లు వెల్లడవుతోంది.