రాజకీయాల్లోకి వచ్చెయ్: మంత్రి పదవిపై అలీకి చంద్రబాబు నుంచి హామీ?
విజయవాడ: ప్రముఖ తెలుగు సినిమా కమెడియన్ అలీ రాజకీయాల్లోకి రావాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. శనివారం విజయవాడలో అలీకి సన్మాన కార్యక్రమం జరిగింది. తెలుగు సినిమా పరిశ్రమలో నలభై ఏళ్ల జీవితాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడారు.
అలీ రాజకీయాల్లోకి రావాలని చంద్రబాబు అన్నారు. రాజకీయాల్లోకి వస్తే తాము అండగా ఉంటామని చెప్పారు. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర రావుల తర్వాత చాలామంది నటనను కెరీర్గా ఎంచుకున్నారని, అన్ని తరాల నటులకు అలీ స్ఫూర్తిగా నిలుస్తారని ప్రశంసించారు. అలీ ఈస్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడ్డారని, పేద కుటుంబంలో పుట్టినా కష్టపడి, అంచెలంచెలుగా ఎదిగారన్నారు.
అలీ తానేమిటో నిరూపించుకున్నాడు
సినిమాల్లో హీరో ఎంతముఖ్యమో హాస్య నటులు అంతే ముఖ్యమని చంద్రబాబు అన్నారు. అలీ సినిమాల్లో నిరూపించుకున్నారని, ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి నూతన ఒరవడిని సృష్టించాలని సూచించారు. ఎన్టీఆర్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమాల్లోకి వచ్చారని, ఆ తర్వాత తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తెలుగు వారికి గుర్తింపు వచ్చిందని తెలిపారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు.
అలీ కూడా ఎంతో కష్టపడ్డారు
నలభై ఏళ్ల సినీ జీవితంలో అలీ కూడా ఎంతో కష్టపడ్డారని, ఓ మంచి వ్యక్తిని అభినందించాలనే ఉద్దేశంతోనే తాను ఈ కార్యక్రమానికి వచ్చానని చంద్రబాబు చెప్పారు. జీవితంలో రిలాక్సేషన్ రావాలంటే అలీ లాంటి వ్యక్తులు ఉండాలని చెప్పారు. అలీకి వారి కుటుంబ సభ్యులు అన్ని వేళల్లో అండగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ పలువురు సినీ ప్రముఖులు, దర్శకులు హాజరయ్యారు.
అలీపై క్లారిటీ వచ్చేసింది
నటుడు అలీ చేరే పార్టీ పైన ఇప్పుడు మరింత క్లారిటీ వచ్చేసినట్లేనని చాలామంది భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్న అలీ వైసీపీలో చేరుతారని, జనసేనలో చేరుతారని, టీడీపీలో చేరుతారని కొద్ది రోజుల క్రితం జోరుగా ప్రచారం సాగింది. అలీ జనసేనానిని కలవడం, ఆ తర్వాత చంద్రబాబును, మంత్రి గంటాను కలవడం చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత అలీ వ్యాఖ్యలను బట్టి ఆయన టీడీపీలో చేరుతారని అర్థమైంది. ఇప్పుడు చంద్రబాబు ఆయనను స్వయంగా ఆహ్వానించడంతో మరింత స్పష్టత వచ్చిందని చెబుతున్నారు. అలాగే, మంత్రి పదవి ఇచ్చిన పార్టీలో చేరుతానని అలీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గెలిస్తే మంత్రి పదవి కూడా చంద్రబాబు హామీ ఇచ్చి ఉంటారని చెబుతున్నారు. అలీకి అన్ని విధాలుగా అండగా ఉంటామని చంద్రబాబు వ్యాఖ్యల్లోని మర్మం అదే కావొచ్చునని భావిస్తున్నారు.