ఫోన్ చేసి బరువు దింపుకున్న బాబు, కల తీరింది: నాని
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పెద్ద బరువు దిగింది! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల రుణాలు రీషెడ్యూల్ చేసేందుకు ఆర్బీఐ గవర్నర్ ఒప్పుకున్నారు. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు మంగళవారం తెలిపారు.
ఈ మేరకు చంద్రబాబు ఆర్బీఐ గవర్నర్తో ఫోన్లో మాట్లాడారు. ఈ సమయంలో ఆర్బీఐ గవర్నర్ ఇందుకు అంగీకారం తెలిపారని మంత్రి చెప్పారు. రుణాల రీషెడ్యూల్తో రైతుల ఖరీఫ్ రుణాలకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఒకటి రెండు రోజుల్లో రీషెడ్యూల్ పైన వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. రైతుల రుణాల రీషెడ్యూల్ కోసం చంద్రబాబు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.

శుభపరిణామం: కేశినాని నాని
రైల్వే బడ్జెట్లో విజయవాడ - ఢిల్లీ ఏసీ ఎక్స్ప్రెస్ కేటాయించడం శుభపరిణామమని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు కేశినాని నాని వేరుగా అన్నారు. దీంతో విజయవాడ ప్రజల 30 ఏళ్ల కల నెరవేరిందన్నారు. టిక్కెట్ ధరలు పెరిగినా సౌకర్యాలు కావాలనే ప్రజలు కోరుకుంటారన్నారు. రైల్వే స్టేషన్ల ఆధునికీకరణపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు.
నిరాశపర్చింది: వినోద్ కుమార్
రైల్వే బడ్జెట్ దేశప్రజలను నిరాశకు గురిచేసిందని తెరాస ఎంపీ వినోద్ కుమార్ వేరుగా అన్నారు. బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన నిధులు ఆశాజనకంగా లేవన్నారు. పోలవరం ఆర్డినెన్సుపై రెండు రాష్ట్రాల అసెంబ్లీల్లో చర్చించాల్సి ఉందన్నారు. ఇవాళ రాత్రికి రాష్ట్రపతిని కలిసి అన్ని విషయాలు తెలియజేస్తామన్నారు. బడ్జెట్ తమను బాగా నిరుత్సాహపరిచిందని మరో ఎంపీ కవిత అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టలేదన్నారు. పెద్దపల్లి - కరీంనగర్ రైల్వే లైను కేటాయిస్తే ప్రజలు సంతోషించి ఉండేవారన్నారు.












Click it and Unblock the Notifications